కరోనాతో ఎమ్మెల్యే మృతి.. రెండు రోజులుగా వెంటిలేటర్పై..
పాకిస్తాన్లోని పంజాబ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే షహీన్ రజా(65) కరోనాకు చికిత్స పొందుతూ బుధవారం(మే 20) కన్నుమూశారు. పాకిస్తాన్లో కరోనా కారణంగా చనిపోయిన మొదటి రాజకీయ నేత షహీన్ కావడం గమనార్హం. ఆమె మృతి విషయాన్ని లాహోర్లోని మయో ఆసుపత్రి సీఈవో ధ్రువీకరించారు. మృతి చెందిన ఎమ్మెల్యే షహీనా పాకిస్తాన్ అధికార పార్టీ తెహ్రీక్ ఇన్సాఫ్ సభ్యురాలు. పంజాబ్ ప్రావిన్స్లోని మహిళా రిజర్వ్ స్థానం నుంచి గెలుపొందారు.
రెండు రోజులుగా వెంటిలేటర్పై...
'శనివారం(మే 16) షహీనాలో కరోనా లక్షణాలు బయటపటడంతో ఆమెను ఓ ఆసుపత్రిలో క్వారెంటైన్ చేశారు. ఆమె శాంపిల్స్ను పరీక్షించి కరోనా పాజిటివ్గా తేలాక.. సోమవారం లాహోర్లోని మయో ఆసుపత్రికి తరలించారు.'అని మయో ఆసుపత్రి వైద్యుడు డా.అస్లం తెలిపారు. ఆమెకు అప్పటికే డయాబెటిస్,హైపర్ టెన్షన్ సమస్యలు కూడా ఉన్నాయన్నారు. గత రెండు రోజులుగా వెంటిలేటర్పై చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్టు తెలిపారు.
క్యాన్సర్ను జయించిన షహీన్..
షహీన్ గతంలో క్యాన్సర్ బారినపడి దాన్ని జయించారని.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తరుచూ క్వారెంటైన్ కేంద్రాలను తనిఖీ చేసేందుకు వెళ్లారని పంజాబ్ మంత్రి యాస్మీన్ రషీద్ తెలిపారు. ఓవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ సడలింపులకే మొగ్గుచూపింది. అయితే వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఈద్ ప్రార్థనలను ఇంటి వద్దే జరుపుకోవాలని పాకిస్తాన్ ప్రెసిడెంట్ అరిఫ్ అల్వి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పాకిస్తాన్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 45,898గా ఉంది. ఇప్పటివరకూ వైరస్ బారినపడి 969 మంది మృతి చెందారు.
రైలు సర్వీసుల పునరుద్దరణ..
బుధవారం నుంచి పాక్షికంగా రైలు సర్వీసులను పునరద్దరించారు. ఇప్పటికే దేశీ విమానయాన సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. రామదాన్ నేపథ్యంలో వేలాదిమంది ప్రజలు రైళ్ల ద్వారా స్వస్థలాలకు సిద్దమవుతున్నారు. అయితే రైళ్లల్లో భౌతిక దూరాన్ని పాటించేలా కేవలం 60శాతం కెపాసిటీతోనే సర్వీసులను నడపనున్నట్టు పాక్ రైల్వే వెల్లడించింది. అన్ని రైల్వే స్టేషన్లలో శానిటైజింగ్ గేట్స్,థర్మో మీటర్స్ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఫేస్ మాస్కు లేని ప్రయాణికులను లేదా టెంపరేచర్ ఎక్కువగా ప్రయాణికులను ఎట్టి పరిస్థితుల్లోనూ రైళ్లలోకి అనుమతించమని చెప్పింది.