పాక్లో ఘోర విమాన ప్రమాదం.. 17 మంది మృతి.. పలువురికి గాయాలు
రావల్పిండి : పాకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఆర్మీకి చెందిన విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలిన ఘటనలో 17మంది మృతి చెందారు. మంగళవారం తెల్లవారుజామున రావల్పిండిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో ఐదుగురు విమానసిబ్బందికాగా.. 12 మంది పౌరులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. విమాన ప్రమాదంలో గాయపడిన 12 మందిని దగ్గరలోని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ట్రైనింగ్లో భాగంగా విమానం చక్కర్లు కొడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రావల్పిండి నగర శివారులో పైలెట్ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోవడంతో విమానం నివాస ప్రాంతంలో కుప్పకూలింది. దీంతో చుట్టుపక్కల ఇళ్లకు మంటలు వ్యాపించాయి. పెద్ద శబ్దంతో విమానం కూలడం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంత ప్రజలు భయంతో వణికిపోయారు.
ప్రమాదానికి ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు చెప్పారు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఘటనాస్థలంలో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. మంటలు ఇంకా చెలరేగుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విమానం కూలడంతో తమ వారి ప్రాణాలతో పాటు గూడు కోల్పోయిన బాధితుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది.