పాక్ టీవి కార్యాలయం ధ్వంసం, తగ్గని నిరసనలు
ఇస్లామాబాద్: పాకిస్దాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇస్లామాబాద్లో పాక్ టీవి కార్యాలయాన్ని ఆందోళన కారులు ధ్వంసం చేశారు. అంతక ముందు సచివాలయంలోకి వెళ్లాలని ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పాకిస్దాన్ ప్రధాని నవాజ్ షరిఫ్ గద్దెదిగాలనే డిమాండ్తో గత 18 రోజులుగా జరుగుతున్న విపక్షాల నిరసనలు శనివారం హింసాత్మకంగా మారాయి.
అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడైన ప్రధాని నవాజ్ షరిఫ్పై హత్యాయత్నం కేసు పెట్టనున్నట్లు తెహ్రీకే ఇన్సాఫ్ నేత ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ప్రధాని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు. నవాజ్ షరిఫ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు.
విపక్షాల నిరసనలు శనివారం రాత్రి హింసాత్మకంగా మారాయి. మాజీ క్రికెటర్ పాకిస్థాన్ తెహ్రీకె ఇన్సాఫ్(పీటీఐ) నేత ఇమ్రాన్ ఖాన్, కెనడాకు చెందిన మత పెద్ద, పాకిస్దాన్ అవామీ తెహ్రీక్ (పీఏటీ) ఛీప్ తహిరుల్ ఖాద్రీ నాయకత్వంలో మద్దతుదారులు కర్రలు చేతబూని ఇస్లామబాద్లోని ప్రధాని నవాజ్ షరిఫ్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. ఈ క్రమంలో ముగ్గురు మరణించారు. 450 మంది గాయపడ్డారు.
ఐతే, వెనక్కి తగ్గని ఆందోళనకారులు కర్రలు, రాళ్లు, ఇతర ఆయుధాలతో పోలీసులపై ఎదురుదాడికి దిగారు. వారి ప్రతి దాడిలో 70 మందికిపైగా పోలీసులు, మరో ఐదుగురు సరిహద్దు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్గత భద్రతపై సమీక్షించడానికి సైనిక కమాండర్లతో ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు. ప్రధాని ఇల్లు ముట్టడికి పిలుపునివ్వడాన్ని తప్పుబట్టిన పార్టీ అధ్యక్షుడు జావెద్ హష్మీని పార్టీ నుండి ఇమ్రాన్ఖాన్ బహిష్కరించారు. రాజీనామా చేయనందుకు మరో ముగ్గురు ఎంపీలను కూడా బహిష్కరించారు.