కరోనా కోరల్లో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్?..ఆయనను కలిసిన సోషల్ వర్కర్కు పాజిటివ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారా? ప్రస్తుతం మన పొరుగు దేశంలో నడుస్తోన్న చర్చ ఇదే. ఇమ్రాన్ ఖాన్కు కరోనా వైరస్ సోకడానికి బలమైన కారణాలు ఉన్నాయనే వార్తలు పాకిస్తాన్లో హల్చల్ చేస్తున్నాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త, ఈధీ ఫౌండేషన్ అధినేత పైసల్ ఈధీ కరోనా వైరస్ బారిన పడటమే దీనికి కారణం. తన తండ్రికి కరోనా వైరస్ సోకిందనే విషయాన్ని ఫైసల్ ఈధీ కుమారుడు సాద్ ఈధీ ధృవీకరించారు.
ప్రస్తుతం తన తండ్రి ఇస్లామాబాద్లో ఉంటున్నారని, ఏ ఆసుపత్రిలో చేరలేదని అన్నారు. సెల్ఫ్ ఐసొలేషన్లో ఉన్నారని చెప్పారు. కరోనా వైరస్ బారిన పడిన ఆయన ఈ విషయం తెలియక ముందు- ఇమ్రాన్ ఖాన్తో సమావేశం అయ్యారు. తన చేతుల మీదుగా ఓ చెక్కును అందించారు. పైసల్ ఈధీ అందించిన ఈ చెక్కును ఇమ్రాన్ ఖాన్ స్వయంగా అందుకున్నారు. దీనితో ఆయనకు కూడా వైరస్ సంక్రమించి ఉండొచ్చనే అనుమానాలు పాకిస్తాన్లో వెల్లువెత్తుతున్నాయి.
ఈ వార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వ అధికారులు ఇంకా నోరు విప్పలేదు. వారి నుంచి ఎలాంటి స్పందనా ఇంకా రాలేదు. పాకిస్తాన్లో మానవ హక్కుల సంరక్షణ, సామాజిక వేత్తగా గుర్తింపు పొందిన అబ్దుల్ సత్తార్ ఈధీ కుమారుడు ఫైసల్ ఈధీ. తన తండ్రి స్థాపించిన ఈధీ ఫౌండేషన్ తరఫున అనేక సామాజిక కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన ఫైసల్ ఈధీ.. ఇస్లామాబాద్లో ఇమ్రాన్ ఖాన్తో సమావేశం అయ్యారు.
وزیر اعظم عمران خان سے فیصل ایدھی کی ملاقات
— PTI (@PTIofficial) April 15, 2020
ایدھی فاونڈیشن کی طرف سے ایک کروڑ روپے کا چیک وزیراعظم کورونا ریلیف فنڈ کے لیے وزیر اعظم کو پیش کیا۔ pic.twitter.com/8FuqDOqmD5
Recommended Video
కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యల కోసం ఆయన ప్రధానమంత్రి సహాయనిధికి కోటి రూపాయల మొత్తాన్ని ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఆయన చెక్కు రూపంలో స్వయంగా ఇమ్రాన్ ఖాన్కు అందజేశారు. అదే ఇప్పుడు తేడా కొడుతోంది. ఇమ్రాన్ ఖాన్ను కలిసే సమయానికే ఫైసల్ ఈధీ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇమ్రాన్ను కలిసిన మూడురోజుల తరువాత అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల సందర్భంగా ఆయనకు వైరస్ సోకినట్లు నిర్ధారించారు.