భారత్ లక్ష్యంగా కొత్త క్షిపణి వ్యవస్థను తయారు చేస్తాం: పాకిస్తాన్
రష్యా నుంచి ఎస్ 400 క్షిపణి వ్యవస్థ భారత్ కొనుగోలు చేయడం వల్ల ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో మళ్లీ యుద్ధమేఘాలు అలుముకుంటాయని పాకిస్తాన్ పేర్కొంది. బాలస్టిక్ క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు భారత్ వివిధ మార్గాలను అన్వేషిస్తోందని పాక్ ఆరోపించింది. ఎస్ 400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుతో శాంతియుతంగా ఉన్న దక్షిణాసియా ప్రాంతం మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటాయని పాక్ పేర్కొంది. అంతేకాదు ఇతర దేశాలు కూడా తమ ఆయుధాల వ్యవస్థ బలోపేతం చేసుకునేందుకు పోటీ పడతాయని పాక్ పేర్కొంది.
5 బిలియన్ అమెరికన్ డాలర్లు మేరా రష్యా నుంచి ఎస్ 400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ నెల మొదట్లో భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ ఒప్పందం జరిగింది. ఎస్ 400 క్షిపణి వ్యవస్థ ఉపరితలం నుంచి గాల్లో ఉన్న లక్ష్యాలను చేధించగలదు. ఇది రష్యా రక్షణ వ్యవస్థలోని ప్రధాన ఆయుధాల్లో ఒకటిగా నిలిచింది. 1998లో ఇరుదేశాలు న్యూక్లియర్ టెస్టులు జరిపాయి. ఆ తర్వాత తాము శాంతిని కోరుతూ నిగ్రహంతో ఉన్నామని పాక్ తెలిపింది. శత్రుదేశాలు తమ దేశంపైకి కయ్యానికి కాలు దువ్వితే వాటిని ఎదుర్కొనేందుకుఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని పాక్ తెలిపింది. భవిష్యత్తులో కూడా తాము శాంతితో వ్యవహరించేందుకే ప్రాధాన్యత ఇస్తామని అలా అని తమ జోలికి వస్తే ఊరుకోబోమని పాక్ పేర్కొంది.
రష్యాకు చెందిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ సుదూర లక్ష్యాలను చేధించగలదు. ఇది ఉపరితలం నుంచి గాలిలో ఉన్న ఎలాంటి లక్ష్యాన్నైనా చేధించగలదు. రష్యా నుంచి ఈ తరహా క్షిపణులు కొనుగోలు చేసిన దేశాల్లో చైనా మొదటిగా నిలిచింది. 2014లోనే చైనా రష్యా నుంచి ఈ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది.