మహాత్ముడిపై పోస్టల్ స్టాంపులు విడుదల: మూడు దేశాల్లో ఒకేసారి
రమల్లా: బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి భారత దేశానికి విముక్తి కల్పించడానికి అహింసాయుత మార్గంలో అసమాన పోరాటాలను చేసిన జాతిపిత మహాత్మాగాంధీని మనదేశం ఒక్కటే కాదు.. ప్రపంచం మొత్తం స్మరించుకుంటోంది. రక్తం చిందించకుండా తెల్లదొరలను దేశం నుంచి తరిమి గొట్టిన అసమాన పోరాట యోధునిగా కీర్తిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మహాత్ముడి అహింసా మార్గాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. మూడు దేశాలు ఒకేసారి మహాత్మా గాంధీపై పోస్టల్ స్టాంపులను విడుదల చేశాయి.
మహాత్మాగాంధీ 'తెలివైన వ్యాపారి’ అన్న అమిత్ షా.. మండిపడిన కాంగ్రెస్
మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని టర్కీ, పాలస్తీనా, ఉజ్బెకిస్తాన్ దేశాలు ప్రత్యేకంగా పోస్టల్ స్టాంపులను విడుదల చేశాయి. స్వాతంత్య్ర పోరాటాన్ని ముందుండి నడిపించిన మహానేతగా ఉజ్బెకిస్తాన్ మహాత్మా గాంధీని కీర్తించింది. ఆయనపై ముద్రించిన పోస్టల్ స్టాంపును ఆ దేశ రాయబార కార్యాలయం అధికారులు విడుదల చేశారు. ఉత్కృష్ట వ్యక్తిత్వం గల నేత అనే పదాలను ముద్రించింది. పాలస్తీనా కొద్దిపాటి మార్పులతో అదే రకమైన స్టాంపును విడుదల చేసింది. దీన్ని పాలస్తీనా సమాచార, సాంకేతిక శాఖ మంత్రి ఇసాక్ సెదర్ ఆవిష్కరించారు. అనంతరం దీన్ని రమల్లా వెస్ట్ బ్యాంక్ లోని భారత రాయబార కార్యాలయ ప్రతినిధి సునీల్ కుమార్ కు అందజేశారు. మహాత్మా గాంధీని స్మారకార్థం ఈ పోస్టల్ స్టాంపును విడుదల చేశామని ఇసాక్ తెలిపారు.
బానిస సంకెళ్ల నుంచి భారత్ ను మాత్రమే కాదు.. యావత్ ఆసియా ఖండాన్ని తప్పించిన మహనీయుడిగా అభివర్ణించింది టర్కీ. ఈ మేరకు ఆ దేశ పోస్టల్ శాఖ ఓ అధికారిక లేఖను, స్టాంపును విడుదల చేసింది. భారత ఉపఖండంలో స్వేచ్ఛా వాయువుల కోసం ఆయన తన ప్రాణాలను సైతం లెక్క చేయలేదని కొనియాడింది. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం కల్పించడానికి దశాబ్దాల కిందటే ఆయన పోరాటం చేశారని, దాని సత్ఫలితాలను ప్రపంచం మొత్తం ఇప్పుడు రుచి చూస్తోందని పేర్కొంది. జాత్యహంకారాన్ని ఎదిరించిన యోధునిగా కీర్తించింది. పేదరిక నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమించారని మహాత్మాగాంధీని స్మరించుకుంది.