ఫొణి రక్కసితో బంగ్లాలో 14 మంది బలి, భారీగా ఆస్తినష్టం
ఢాకా : ఫొణి రక్కసి బంగ్లాదేశ్లో విలయతాండవం చేసింది. సూపర్ సైక్లోన్ ధాటికి 14 మంది చనిపోగా .. 63 మంది గాయపడ్డారు. పెను తుఫాను ప్రభావంతో 16 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను ప్రభావంతో 36 గ్రామాలు వరదల్లో మునిగినట్టు అధికారులు వివరించారు.
మరో 14 మంది కూడా ..
నోఖాలి, భోలా, లక్ష్మీపూర్ సహా 8 తీర ప్రాంత జిల్లాల్లో కూడా 14 మంది చనిపోయినట్టు ఢాకా ట్రిబ్యున్ తన కథనంలో పేర్కొంది. అయితే వారిలో రెండేళ్ల బాలుడు సహా నలుగురు మహిళలు ఉన్నట్టు తెలిపింది.
శిథిలాల కింద చిన్నారి శిథిలమై ..
నోఖాలి జిల్లాలో ఓ ఇల్లు కూలడంతో ఓ చిన్నారి చనిపోయాడు. మిగతావారికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో 12 విమానాలను రద్దు చేసినట్టు విమానయాన వర్గాలు పేర్కొన్నాయి.
ఒడిశాలో 12 మంది ..
ఇటు ఫొణి తుఫానుతో ఒడిశాలోనూ 12 మంది మృతిచెందారు. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్టు అధికారులు లెక్కగట్టారు. తుఫాను గురించి వాతావరణ శాఖ హెచ్చరించడంతో కేంద్రప్రభుత్వం ముందుగానే వెయ్యి కోట్ల నిధులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.