ఫ్రాన్స్లో ఉగ్రదాడి: డోర్ తీయండి ప్లీజ్.. రోడ్డుపై చిన్నారి
ప్యారిస్: తలుపులు తెరవండీ ప్లీజ్.. అంటూ ఓ బాలిక ఆర్తనాదాలు చేసిందని, బల్లల కింద దాక్కున్నప్పటికీ ఐసిస్ ఉగ్రవాదులు వదల్లేదని చెబుతున్నారు. ప్యారిస్లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 128 మంది మృతి చెందారు.
బయట నుంచి హఠాత్తుగా తుపాకీ పేలుడు శబ్దాలు వినిపించాయని, ఉలిక్కిపడి ఏం జరిగిందో చూద్దామని కిటికీ తలుపులు తెరిచానని, ఉగ్రవాదులెవరూ తనకు కనిపించలేదని, అయితే తుపాకీ కాల్పుల శబ్దాలు మాత్రం ఎక్కువగా వినిపించసాగాయని, ప్రజలు భయంతో పరుగులు తీస్తూ కనిపించారని, ఎవరో కాలుస్తున్నారు.. అంటూ బిగ్గరగా అరుస్తున్నారని పారిస్కు చెందిన 30 ఏళ్ల యువకుడు ఆంటోనీ పోర్చీ తన అనుభవాన్ని వివరించారు.
ఆయన మాట్లాడుతూ... ఓ బాలిక వీధిలో ఏడుస్తూ కనిపించిందని, ఆమె ప్రతి ఇంటి తలుపునీ భయంతో తడుతూ ఎవరైనా తలుపులు తెరవండి ప్లీజ్.. అంటూ బిగ్గరగా ఏడిచిందని, ఆ క్షణం ఆమెను చూసి ఏం చెయ్యలేని నా నిస్సహాయతపై నాకే విసుగు కలిగిందని చెప్పాడు.
మరుక్షణమే ఆమె తన కళ్ల ముందు నుంచి మాయమైందని, ఉగ్రవాదులు క్షణాల్లో అన్ని దిక్కులకూ వెళ్లిపోయారని, వారు వీరు అని తేడా లేకుండా విచ్చలవిడిగా జనాలపై కాల్పులు జరుపుతున్నారని, ఇంతలోనే సైరెన్లు, హారన్లతో భద్రతా దళాల వాహనాలు రంగ ప్రవేశం చేశాయన్నాడు.
ఉగ్రవాదులు జరిపిన దాడిలో కేజ్నొవ్స్ అనే వ్యక్తి గాయపడ్డాడు. అయినా ధైర్యం కోల్పోకుండా ఫేస్బుక్లో పోస్ట్లు చేస్తూ అందర్ని అప్రమత్తం చేయడం గమనార్హం. మరోవైపు, ఫ్రాన్స్లో ముష్కరుల మారణహోమంలో చెల్లాచెదురైన ప్రజలు తమ బంధువులు, స్నేహితుల జాడను తెలుసుకునేందుకు ఫేస్బుక్ తన వంతు సాయంగా 'సేఫ్టీ చెక్' సదుపాయాన్ని కల్పించింది.
యుద్ధమే: అమెరికా, రష్యా, ఫ్రాన్స్
ఉగ్రవాదంతో ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న ఐసిస్ పైన ఇక ఏ మాత్రమూ ఉపేక్షించేది లేదని, వారి చర్యలను ప్రపంచంపై యుద్ధంగానే పరిగణిస్తున్నామని అమెరికా, రష్యా, ఫ్రాన్స్లతో పాటు పలు యూరప్ దేశాలు స్పష్టం చేశాయి.
సిరియాలో నెలకొన్న సంక్షోభంపై వియన్నాలో సమావేశమైన పలు దేశాల ప్రతినిధులు ఈ మేరకు తీర్మానం చేశారు. ఉగ్రవాదుల దాడుల శక్తి పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఇక ఐసిస్ను పూర్తిగా తుద ముట్టించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఫ్రాన్స్ పోలీసులు మళ్లీ భయపడ్డారు!
పారిస్లో 1500 మంది అదనపు జవాన్లను మోహరించిన పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇంతలో పారిస్ సబర్బన్ ప్రాంతంలో పేలుళ్ల శబ్దం వినిపించింది. అంతే, సెకన్ల వ్యవధిలో అక్కడ పోలీసులు వాలిపోయారు. ఆ పరిసరాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధమై జల్లెడపట్టారు. అయితే అక్కడ జరిగింది బాంబు పేలుళ్లు కాదు. బాణాసంచా కాల్పులని తెలుసుకుని వెనుదిరిగారు. అక్కడ ఓ వివాహం సందర్భంగా జరిగిన పేలుళ్లని నిర్ధారించుకుని నిష్క్రమించారు. దీనిపై మీడియాతో మాట్లాడుతూ... ముందు గాభరాపడ్డామని, తర్వాత అవి వివాహం సందర్భంగా జరిగిన బాణసంచా కాల్పులని తెలుసుకుని నిట్టూర్చామని వారు చెప్పారు.