మోడీ, ఇండియన్స్ సూపర్: ఒబామా, బాన్ కీ మూన్
న్యూయార్క్: పారిస్ ఒప్పందానికి భారతదేశం పచ్చజెండా ఊపడంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. పారిస్ ఒప్పందంపై ఒబామా ట్విట్టర్ ద్వారా స్పందించారు.
శాంతిని చాటిన మహనీయుడు, భారత జాతిపిత మహాత్మాగాంధీ బాటలో, ఆయన అడుగుజాడల్లో భారత్ ప్రధాని నరేంద్ర మోడీ, భారతదేశ ప్రజలు నడుస్తున్నారని బరాక్ ఒబామా పోస్టులో రాశారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్ పోస్టుకు ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ ప్రకృతిని కాపాడుకోవడం భారతీయుల లక్షణమని సమాధానం ఇచ్చారు. పారిస్ వాతావరణ ఒప్పందపత్రాలను యూఎన్ కు భారత్ అందించింది.
పత్రాలు అందినవెంటనే యూఎన్ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ భారతీయులందరికీ ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. గ్రీన్ హోస్ వాయువులను అత్యధికంగా విడుదల చేస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. పారిస్ ఒప్పందానికి భారత్ పచ్చ జెండా ఊపడంతో పారిస్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ హర్షం వ్యక్తం చేశారు. భారత్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.