కొత్త చట్టం: కొత్తగా తల్లయిన మహిళా ప్రజాప్రతినిధులు తమ పిల్లలను పార్లమెంటుకు తీసుకురావొచ్చు
ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాల పార్లమెంట్లు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టే యోచనలో ఉన్నాయి. అప్పుడే తల్లి అయినా మహిళా ప్రజా ప్రతినిధులు తమ చంటి పిల్లలను పార్లమెంటు సమావేశాలకు తీసుకొచ్చేలా చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. తద్వారా పార్లమెంటుతో పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఫ్రెండ్లీ వాతావరణం కల్పించినట్లు అవుతుందని భావిస్తున్నాయి.
గత నెల 21న న్యూజిలాండ్ ప్రధాని జాసిండా ఆర్డ్రన్ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ బాగోగులు ఓ వైపు చూస్తూనే పాలనపై కూడా దృష్టి సారించాల్సి వస్తోంది. అంతేకాదు కీలకమైన చట్టాలు చేసేందుకు పార్లమెంటు సమావేశమైనప్పుడు చంటి బిడ్డ పరిస్థితి కూడా ఆమెపై ఉంటుందన్నది మరవకూడదు. ఇందులో భాగంగానే ఆ దేశ పార్లమెంటు చంటి బిడ్డలను సమావేశాలకు తీసుకువచ్చేలా చట్టం చేసింది. ఇదే పద్ధతిని ఇప్పుడు ప్రపంచ దేశాల పార్లమెంటులు అవలంబించాలని భావిస్తున్నాయి. చంటిబిడ్డలు ప్రజాప్రతినిధులైన తల్లుల మధ్య ఉన్న సంబంధం ప్రత్యేకంగా చూడాలని...ఇందుకోసం ప్రత్యేక నిబంధనలు తీసుకురావడంలో ఎలాంటి తప్పులేదని న్యూజిలాండ్ పార్లమెంట్ స్పీకర్ వ్యాఖ్యానించారు.
చంటిబిడ్డలతో పాటు ప్రజాప్రతినిధులైన తల్లులు పార్లమెంటు సమావేశాలకు హాజరవడం చాలా దేశాల్లో లేదు. ఉదాహరణకు గత నవంబర్లో జపాన్ ప్రజాప్రతినిధి అయిన యుకా ఒగాట తన ఏడునెలల బాలుడితో మున్సిపల్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాగా... ఆమె వెంటనే బయటకు వెళ్లాల్సిందిగా ఆదేశించడం జరిగింది. కొన్ని కీలక బిల్లులపై వీరు ఓటు వేయాల్సి ఉంది. అయితే ఇలా బయటకు పంపడంతో ఓటు వేసే అధికారాన్ని కోల్పోయారు. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ నామినేట్ చేసిన వ్యక్తి నాసా స్పేస్ ఏజెన్సీకి బాస్గా వ్యవహరిస్తారనే దానిపై జరిగిన ఓటింగ్ చాలా కీలకంగా మారింది. అదే సమయంలో సెనేటర్గా సేవలందిస్తున్న టామీ డక్ వర్త్ అనే తల్లి ఓటు కీలకం కావడంతో ఆమె తన చంటిబిడ్డను తీసుకొచ్చి ఓటింగ్లో పాల్గొన్నారు.
ఇక న్యూజిలాండ్ పార్లమెంటు మాత్రం ప్రజాప్రతినిధులు తమ పిల్లలను సమావేశాలకు తీసుకురావచ్చని తెలిపింది. చంటి బిడ్డలైతే తల్లుల దగ్గరే ఉంటారు. కాస్త పెద్ద పిల్లలు మాత్రం వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చైల్డ్ కేర్ సెంటర్లో గానీ, లేదా బొమ్మలు ఉన్న గదిలో కాని ఉండేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.