ఇరాన్లో కూలిన విమానం: 66 మంది మృతి
టెహర్రాన్:ఇరాన్లో ఆదివారం నాడు ఓ విమానం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే రాడార్కు చిక్కకుండా పోయింది. అయితే ఈ విమానం కుప్పకూలిపోయిందని అధికారులు ప్రకటించారు.ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 66 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏస్మ్యాన్కు చెందిన విమానం టెహర్రాన్ నుండి యాసూజ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సుమారు 66 మంది ప్రయాణీకులు ఉన్నారని అధికారులు ప్రకటించారు.
ఎటిఆర్ 72 నెంబర్ గల విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాలకే రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. సాంకేతిక కారణాలతో విమానాన్ని అత్యవసర పరిస్థితుల్లో లాండింగ్ చేసేందుకు పైలెట్ ప్రయత్నించినట్టు స్థానిక మీడియా ప్రకటించింది. ఆ సమయంలో విమానం కుప్పకూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.
ఇరాన్లోని ఇస్ప్రాన్ ఫ్రావిన్స్ లో విమానం కూలిపోయిందని అధికారులు గుర్తించారు. వాతావరణం అనుకూలించని కారణంగానే విమానం కూలిపోయిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. సహయక చర్యలను ప్రభుత్వం ప్రారంభించింది.
అయితే సహయక చర్యలను చేపట్టేందుకు సంఘటనా స్థాలానికి చేరుకోవడానికి రెస్క్యూటీమ్కు చాలా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు సంఘటన స్థలానికి చేరుకొనే మార్గం సరిగా లేని కారణంగానే ఈ పరిస్థితి ఉందంటున్నారు.
టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సెమిరోమ్ కొండప్రాంతంలో రాడార్తో సంబంధాలు తెగిపోయాయి.మృతుల్లో ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు ఏస్మ్యాన్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.