కొరియా కామాంధుడు: దేవుడి ఆదేశాల మేరకే ఆ పాడుపని చేశాడట ఈ పాస్టర్
సియోల్ : కేరళ నన్పై ఓ మాజీ బిషప్ అత్యాచారం చేసిన ఘటన మరువకముందే ఇలాంటి ఘటనే దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ బిషప్ ఫ్రాంకోములక్కల్కు మాత్రం బెయిల్ లభించగా ఉత్తర కొరియా పాస్టర్కు మాత్రం అక్కడి న్యాయస్థానం 15 ఏళ్లు జైలుశిక్ష విధించింది. ఇక వివరాల్లోకి వెళితే దక్షిణ కొరియాలో అత్యంత ప్రభావం చూపే మెగా చర్చ్ పాస్టర్ లీజేరాక్ 8మంది మహిళా భక్తులపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
పాస్టర్ లీజేరాక్కు లక్షా 33వేల మంది భక్తులు
లీజేరాక్...వయస్సు 75 ఏళ్లు. వయసు మీద పడినప్పటికీ ఈ పాస్టర్గారి కోరికల్లో మాత్రం చేవ చావలేదు. మన్మిమ్ సెంట్రల్ చర్చ్ పాస్టర్గా ఉన్న ఈయనకు భక్తులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దాదాపు 1,33,000 మంది భక్తులు ఈయనకున్నారు. అంతేకాదు ఈ చర్చికి సంబంధించి 10వేల బ్రాంచిలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. విచారణ సందర్భంగా ఈ పాస్టర్ నేరం ఒప్పుకోలేదని వాషింగ్టన్ పోస్టు పత్రిక వెల్లడించింది. అంతేకాదు చేసిన పాడు పనికి కనీసం పశ్చాత్తాపం కూడా చెందడం లేదట. ఆ తర్వాత నేరం అంగీకరించినప్పటికీ మహిళలపై అత్యాచారానికి పాల్పడాల్సిందిగా దేవుడి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయని కాకమ్మ కబుర్లు చెప్పాడు.
దైవిక చర్యగా భావించిన మహిళా భక్తులు
ఇదిలా ఉంటే లీజే రాక్ భక్తి ముసుగులో మహిళా భక్తులపై లైంగిక దాడి చేశాడని కోర్టు చెప్పింది. భక్తులు చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్లడం..అతన్ని దేవుడిలా భావించి అతనితో సఖ్యతగా ఉంటే మోక్షం లేదా స్వర్గంకు వెళతారని నమ్మేవారని ఇదే అదనుగా తీసుకుని వారిపై అత్యాచారం చేసేవాడని కోర్టు తెలిపింది. ఇక మహిళా భక్తులు తనకు ఎదురు తిరగకుండా మానసికంగా తయారు చేసేవారని ఆ తర్వాత వారిపై అత్యాచారం చేసేవాడని కోర్టు తన రూలింగ్లో వివరించింది. బాధితులంతా 20 ఏళ్లు వయసున్నవారే అని కోర్టు తెలిపింది. మరోవైపు లీజేరాక్ను దైవంగా చూశారు కాబట్టి...దేవుడు పొరపాటు చేయరని భక్తులు భావించి తాను ఏమి చేసిన కాదనే వారు కాదని కోర్టు తెలిపింది. అంతేకాదు దాన్ని లైంగిక చర్యగా కాకుండా ఒక దైవిక చర్యగా మహిళా భక్తులు భావించేవారని కోర్టు పేర్కొంది. అందుకే వారు లీజేరాక్కు లొంగిపోవాల్సి వచ్చేదని ఒక వేళ ఎదురు ప్రశ్నిస్తే అది పాపం చేసినట్లు అవుతుందని భావించి ఎదురు తిరిగేవారు కాదని తెలిపింది కోర్టు.
లైంగిక జీవితంపై ఛానెల్ కథనాలు ప్రసారం చేస్తే ధ్వంసం
ఎనిమిది మంది మహిళలపై లీజేరాక్ అత్యాచారం 1990 నుంచి 2015 మధ్యలో చేశాడని కొరియన్ హెరాల్డ్ అనే పత్రిక వెల్లడించింది. ఇతని లైంగిక కార్యకలాపాల గురించి 1999లోనే ఓ టెలివిజన్ ఛానెల్ కథనాలు ప్రసారం చేసింది. అలాంటి వ్యక్తి జబ్బులను ఎలా నయం చేయగలడు అంటూ ఛానెల్ కథనాలు ప్రసారం చేయడంతో ...ఆగ్రహం చెందిన 300 మంది భక్తులు ఆ టీవీ స్టేషన్ పై దాడి చేశారు. అంతేకాదు మరో ఛానెల్ తన లైంగిక జీవితంపై కథనాలు ప్రసారం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండగా కోర్టు ఆర్డర్ తీసుకువచ్చి ఆ కథనాలు ప్రసారం కాకుండా చూశాడు లీజేరాక్. లైంగిక వేధింపుల ఆరోపణలు ఆయన్ను చుట్టుముట్టినప్పటికీ...ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించి అక్కడ తన ఆధ్యాత్మిక బోధను ప్రకటించేవాడు.
ప్రార్థనలతోనే ప్రాణాంతక వ్యాధులు నయం చేస్తానంటూ ప్రచారం
మన్మిన్ సెంట్రల్ చర్చి లీజేరాక్ ఆరోగ్యం బాగలేనివారికి, జబ్బులతో బాధపడేవారికి ప్రార్థనలు చేసి వ్యాధులను నయంచేసి అద్భుతాలు చేసేవాడని తన వెబ్సైట్లో ఇప్పటికీ రాసుకుంటుంది. ఇప్పటికీ ఎయిడ్స్, క్యాన్సర్తో పాటు నయంకానీ ఇతరత్రా జబ్బులు కూడా లీజేరాక్ ప్రార్థనల ద్వారా నయం చేసేవాడని మన్మిన్ చర్చి పాలనావిభాగం చెబుతూ ఉంటుంది. లీజేరాక్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవమైనవని...ఆ ఆరోపణలను ఖండిస్తున్నట్లు చర్చి పాలనావిభాగం ఒక ప్రకటనలో తెలిపింది. లైంగిక విలువల గురించి ఈ పాస్టర్ గత కొంతకాలంగా వాక్యం ద్వారా చెబుతున్నారని చర్చి చెబుతోంది. పాస్టర్ అంటే ఎవరో గిట్టని వారే ఇలాంటి తప్పుడు ఆరోపణలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది.