సర్జరీ చేస్తుండగా ఆపరేషన్ థియేటర్లో మంటలు..మృతి చెందిన పేషెంట్
రొమానియా: రొమానియాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళకు వైద్యులు శస్త్ర చికిత్స చేస్తుండగా హఠాత్తుగా మంటలు చెలరేగి ఆ మహిళకు అంటుకోవడంతో ఆమె మృతి చెందింది. ఈ ఘటన బుకారెస్ట్లోని ఓ హాస్పిటల్లో చోటుచేసుకుంది. మహిళ పాంక్రియాటిక్ కేన్సర్తో బాధపడుతోంది. చికిత్స కోసం ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఇక సర్జరీ నిర్వహిస్తున్న సమయంలో వైద్యులు విద్యుత్ పరికరాలను వినియోగించారు. ఆ సమయంలోనే మంటలు చెలరేగి ఆమె 40 శాతం శరీరాన్ని దహించి వేశాయి.
సర్జరీ చేస్తుండగా విద్యుత్ పరికరాల నుంచి మంటలు
ఈ ఘటన గురించి రొమానియన్ నేత ఇమాన్యుయేల్ ఉంగ్రీను తన ఫేస్బుక్ పేజ్పై రాసుకొచ్చారు. పేషెంట్కు సర్జరీ చేసే సమయంలో ఒక టార్చిలైటును వెలిగించేలా ఆమె శరీరంకు మంటపెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే ఆమెకు ఆల్కహాల్తో కూడిన డిసిన్ఫెక్టెంట్ను వైద్యులు ఇచ్చారు. ఎప్పుడైతే ఈ విద్యుత్ పరికరాలు వెలిగి పొరపాటున ఆల్కహాల్ డిసిన్ఫెక్టెంట్కు రాసుకున్నాయో వెంటనే మంటలు చెలరేగినట్లు ఆయన తన పోస్టులో తెలిపారు. ఘటనపై విచారణకు ఆదేశిస్తామని రొమానియా ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యంపై సర్వత్రా ఆగ్రహం
సర్జరీ కోసం విద్యుత్ పరికరాలను వినియోగించాలని భావిస్తే ఆల్కహాల్ డిసిన్ఫెక్టెంట్ను పేషెంట్కు ఇవ్వరాదన్న కనీస ఆలోచన వైద్యులకు లేకపోవడం శోచనీయమన్నారు డిప్యూటీ మినిస్టర్ హోరతియు మోల్డావన్. ఇదిలా ఉంటే ప్రమాదం ఎలా జరిగిందో చెప్పేందుకు హాస్పిటల్ యాజమాన్యం నిరాకరిస్తోందని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. రొమానియాలో చాలా వరకు ప్రభుత్వ హాస్పిటల్స్లో వైద్యుల కొరత, ఎక్విప్మెంట్ కొరత ఉంది. సరైన సదుపాయాలకోసం నిధులను ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ అవి దారి మళ్లుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనం ఆరోగ్యశాఖలో బయటపడుతున్న స్కాములే అని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
2015లో నిర్లక్ష్యం వల్ల గాల్లో కలిసిన 64 మంది ప్రాణాలు
2015లో ఓ నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా బాధితులను మెరుగైన వైద్యం కోసం తరలించడంలో కావాలనే అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఆలస్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో 64 మంది చనిపోయారు. 26 మంది స్పాట్లో చనిపోగా మరో 38 మంది సరైన వైద్యం అందక మృతిచెందారు. ఇందుకు కారణం ఆ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ సరిగ్గా లేకపోవడమే అని తెలుస్తోంది.