నవాజ్ జర్దారీలకు ఇమ్రాన్ వార్నింగ్: దోచుకున్న డబ్బు తిరిగి కట్టాకే దేశం దాటండి
కరాచీ: దేశంలో అవినీతికి పాల్పడ్డ నాయకులను క్షమించేందుకు తను ప్రభుత్వం సిద్ధంగా లేదని అన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. పాక్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలి జర్దారీ, ప్రధాని నవాజ్ షరీఫ్లను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే వారు దోచుకున్న డబ్బును తిరిగి అప్పగిస్తే వారు ప్రాణాలతో మరో దేశంకు వెళ్లిపోవచ్చని చెప్పారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నవాజ్ షరీఫ్ విడుదలకు ఆయన కుమారులు పాకిస్తాన్ మిత్రదేశాల ద్వారా పాక్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ రెండు మిత్రదేశాలు నవాజ్ షరీఫ్ను విడుదల చేయాల్సిందిగా తనకు సందేశాన్ని పంపాయని అయితే ఆరెండు దేశాలు ఏవో ఇప్పుడు బయటకు చెప్పలేనని ఇమ్రాన్ఖాన్ అన్నారు.
69 ఏళ్ల నవాజ్ షరీఫ్ ప్రస్తుతం తనకు విధించిన ఏడేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్నాడు. లాహోర్లోని కోట్ లక్పథ్ జైలులో ఆయన ఉన్నారు. పనామా పేపర్ కేసులో తన పేరు ఉండటంతో మూడు అవినీతి ఆరోపణలు రుజువైన నేపథ్యంలో ఆ దేశ సుప్రీంకోర్టు నవాజ్ షరీఫ్కు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అయితే తాము ఎలాంటి అవినీతికి పాల్పడలేదని షరీఫ్ కుటుంబం కోర్టుకు తెలిపింది. తమపై ఉన్న కేసులు రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగమేనని చెప్పారు. నవాజ్ షరీఫ్ మే నెలలో ఆరోగ్యకారణాలు చూపుతూ బెయిల్కు దరఖాస్తు చేసుకోగా కోర్టు తిరస్కరించింది.
ఇదిలా ఉంటే అవినీతికి పాల్పడి డబ్బును దోచుకున్నవారు అది తిరిగి చెల్లించేవరకు దేశం దాటలేరని ఇమ్రాన్ఖాన్ హెచ్చరించారు. చికిత్స కోసం నవాజ్ షరీఫ్ దేశం దాటి వెళ్లాలంటే ముందుగా ఆయన దోచుకున్న డబ్బులు ముందుగా చెల్లించాలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. దేశంలో మనీలాండరింగ్కు పాల్పడిన వారికి వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పిన ఇమ్రాన్ ఖాన్... వారిని వెంటనే సాధారణ ఖైదీలు ఉండే జైలుకు తరలించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. వారి విడుదలకు ప్రయత్నాలు చేసుకోవచ్చని చెప్పిన ఇమ్రాన్ ఖాన్ వారిని విడుదల చేయాలని ఇతర దేశాలు ఒత్తిడిని తాము ఒప్పుకొనేది లేదని తెలిపారు. డబ్బులు చెల్లిస్తేనే వారిని విడుదల చేస్తామని వెల్లడించారు.
ఎన్ఏబీ ప్రకారం షరీఫ్ జర్దారీలు 150 మిలియన్ రూపాయలు నకిలీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా లావాదేవీలు చేశారని ఇమ్రాన్ఖాన్ చెప్పారు. ప్రస్తుతం కష్టాల ఊబి నుంచి బయటపడుతున్నామని త్వరలోనే పాక్ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. గత ప్రభుత్వాలు చేసిన అప్పులను దాదాపు 10 బిలియన్ అమెరికన్ డాలర్లను చెల్లించామని వివరించారు. స్మగ్లింగ్ మనీ లాండరింగ్లపై త్వరలో చట్టాన్ని సవరణ చేస్తామని ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ అన్నారు.