శాంతి మంత్రమా, యుద్ధమా?.. 72 గంటల్లో తేలుస్తామంటున్న పాక్
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో టెర్రరిస్టులపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకున్న దరిమిలా పాకిస్థాన్, భారత్ మధ్య యుద్ధమేఘాలు అలముకున్నాయి. చర్యకు ప్రతిచర్యగా పాకిస్థాన్ కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బుద్ధిచెప్పినా.. కుక్క తోక వంకర అన్న చందంగా దాయాది తీరు మారడం లేదు. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత సైన్యాన్ని రెచ్చగొడుతోంది. ఈ క్రమంలో యుద్ధం అనివార్యమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్థాన్ - ఇండియా మధ్య తీవ్ర ఉద్రికపరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అయితే రానున్న 72 గంటలు అత్యంత కీలకమంటున్నారు పాకిస్థాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్. శాంతి ఒప్పందానికి వెళ్లడమా? యుద్ధం చేయడమా అనేది మూడు రోజుల్లో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. అనుకోకుండా యుద్ధం గనక జరిగితే.. రెండో ప్రపంచ యుద్ధాన్ని మించి పెద్దదిగా మారే అవకాశాలున్నట్లు తెలిపారు. అంతేకాదు ఇరు దేశాల మధ్య ఇదే అంతిమ యుద్ధం కావొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు.