అమెరికా..చేతులెత్తేసిందా?: రెండు వారాలు భయానకం: లక్షమందికిపైగా: బాంబు పేల్చిన ట్రంప్..!
న్యూయార్క్: అమెరికా.. అగ్రరాజ్యంగా పేరున్న దేశం. పెద్దన్నగా ప్రపంచ దేశాలపై కర్ర పెత్తనాన్ని చలాయిస్తుందనే పేరుందా దేశానికి. రక్షణ, ఆర్థికం, వైద్య రంగాలు సహా అన్ని సెక్టార్లపైనా తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించిన అమెరికా ప్రస్తుతం కరోనా పేరు వింటేనే హడలి పోతోంది. చివురుటాకులా వణికిపోతోంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య ఆ దేశ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,000లను దాటేసింది.
ఏపీ హోం మంత్రి గుడ్ డెసిషన్: లాక్డౌన్ డ్యూటీల నుంచి అలాంటి పోలీసులకు మినహాయింపు.. !
రెండు వారాలు మరింత భయానకం..
కరోనా వైరస్కు పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనా సహా మరే ఇతర దేశంలో కూడా ఈ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదంటే.. అమెరికాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు- తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ప్రకటన అమెరికా దుస్థితికి అద్దం పడుతోంది. వచ్చే రెండు వారాల్లో మరింత భయానక పరిస్థితులు ఏర్పడటానికి అవకాశాలు ఉన్నాయంటూ ట్రంప్ చేసిన ప్రకటన అమెరికన్లను ఆందోళనల్లోకి నెట్టేసింది.
గరిష్ఠ మరణాలు నమోదయ్యే ఛాన్స్..
వచ్చే రెండు వారాల్లో కరోనా వైరస్ బారిన పడి మరణించే వారి సంఖ్య అనూహ్యంగా ఉండొచ్చని ట్రంప్ అంచనా వేశారు. గరిష్ఠ స్థాయిలో మరణాలు నమోదవుతాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఆయన వైట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లక్ష నుంచి రెండు లక్షల మంది అమెరికన్లు కరోనా వైరస్ మరణించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నామని అన్నారు. మృతుల సంఖ్య లక్ష దగ్గర ఆగినా.. తాము చక్కగా పనిచేసినట్టుగా అభినందించుకోవాల్సి ఉంటుందని అన్నారు.
లక్ష దగ్గర ఆగితే హ్యాపీ..
దేశంలో నెలకొన్న ఆరోగ్య పరిస్థితులు, కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు అందజేస్తోన్న వైద్యం.. వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ప్రకటన చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య లక్ష దగ్గర ఆగితే సంతోషించాల్సిన పరిస్థితి రావొచ్చని చెప్పుకొచ్చారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షయస్ డిసీజ్ నివేదిక ఆధారంగా తాను ఈ అంచనాను వేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మరిన్ని కఠిన నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తోందని అన్నారు. ఇప్పటికే అమెరికన్లు నిస్వార్థంగా పనిచేస్తున్నారని, ఇళ్లకే పరిమితం అయ్యారని చెప్పారు.
Recommended Video
ఏప్రిల్ 30 వరకూ లాక్డౌన్..
కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ఇదివరకే జారీ చేసిన నిబంధనలు, సామాజిక దూరాన్ని ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగించబోతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కఠినతరమైనప్పటికీ కరోనా వైరస్ నిబంధనలను ప్రతి అమెరికన్ కూడా తప్పనిసరిగా పాటించి తీరాల్సి ఉంటుందని ఆయన ఆదేశించారు. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. రెండు నెలల తరువాత దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి అవకాశం ఉందని ట్రంప్ వెల్లడించారు. జూన్ 1 తరువాత దేశం మామూలు స్థితికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు, నిపుణులు అంచనా వేస్తున్నారని తెలిపారు.