మనిషి చేసిన తప్పు: ఆకలితో అలమటించి మృత్యువాత పడ్డ పెంగ్విన్
ప్రకృతిని మానవుడు నాశనం చేస్తున్నాడు అనేదానికి ఇదొక ఉదాహరణ. జీవరాశులు నివసించే భూమిపై మానవుడు తప్పిదాల వల్ల కొన్ని జంతువులు కూడా అంతరించి పోతున్నాయి. మట్టి నుంచి నదుల వరకు విషపదార్థాలు నిండిఉన్నాయి. మనిషికే ముప్పు తెస్తున్నాయి. అంతేకాదు పశుపక్షాదులు కూడా మానువుడు చేసిన చిన్న తప్పిదాలతో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటి వరకు మనిషి కలుషితం చేయనిదంటూ ఏదీ లేదు. తాజాగా మనిషి చేసిన పొరపాటుకు ఓ పెంగ్విన్ పక్షి మృతి చెందింది. ఈ ఫోటో వైరల్ కావడంతో జంతు ప్రేమికులను కంటతడి పెట్టించింది.
బెలూన్లలో కాళ్లు చిక్కుకుని తల్లడిల్లిన పెంగ్విన్
మనిషి తన సరదాల కోసం జంతువుల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. తాజాగా మార్నింగ్టన్ పెనిన్సులాలో ఒక మహిళా సముద్రతీరంలో చెత్త తీసివేస్తుండగా ఆమె కంటికి మృతి చెందిన ఒక పెంగ్విన్ పక్షి కనిపించింది. దాని కాళ్లకు బెలూన్లు కట్టినట్టుగా కనిపించింది. అయితే ఎవరో అంతకుముందు అక్కడ పార్టీ చేసుకుని బెలూన్లను ఊదేసి పడేశారు. పార్టీకి వినియోగించే రిబ్బన్లు కూడా పడేశారు.ఇక అటువైపుగా చెంగు చెంగున ఎగురుకుంటూ వచ్చిన పెంగ్విన్ కాళ్లు ఆ బెలూన్లు రిబ్బన్లలో చిక్కుకుపోయాయి. దీంతో ఆ పెంగ్విన్ నరకయాతన అనుభవించినట్లుగా అది పడిఉన్న పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. దాని కాళ్లు అందులో చిక్కుకుపోవడంతో ఎటూ కదలలేని పరిస్థితి అయిపోయింది
ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయిన పెంగ్విన్
పెంగ్విన్ కాళ్లు చిక్కుకుపోవడంతో ఆ నాలుగురోజులు ఆకలికి అలమటించిపోయి ఉంటుంది. దాహానికి తల్లడిల్లిపోయి ఉంటుంది. అలా తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు చిక్కును వదలించుకోవాలని ప్రయత్నించింది. ప్రయత్నించి ప్రయత్నించి ఒంట్లో శక్తి నశించి ఆకలికి అలమటించి చివరికి అలా మృతి చెంది ఉంటుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పలువురు జంతు ప్రేమికులు కంటతడి పెట్టారు. అంతేకాదు బీచ్లలో ఆటలాడే వారు బెలూన్లు కానీ, రిబ్బన్లు కానీ అక్కడ పడవేయరాదని వాటివల్ల సముద్రంలో నివసించే జంతువులు మృత్యువాత పడుతాయని చెబుతున్నారు.సముద్రంలో బబుల్స్ ఊదండి కానీ బెలూన్స్ను కాదు అంటూ సోషల్ మీడియాలో జంతు ప్రేమికులు రాసుకొచ్చారు.
ఆహారం దొరక్క ప్లాస్టిక్ తిన్న గజరాజు
ప్రకృతి వినాశనంలో బెలూన్లు కూడా ఒకటిగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. సముద్రంలో నివసించే జంతువులకు బెలూన్లు చాలా ప్రమాదంగా పరిణమిస్తాయని చెబుతున్నారు. కాళ్లు అందులో చిక్కుకుపోయి చాలా ఇబ్బంది పడుతాయని చెప్పారు. అంతేకాదు రబ్బర్ వస్తువులు కూడా సముద్రంలో నివసించే జంతువులకు చాలా డేంజర్ అని చెబుతున్నారు. పెద్ద పెద్ద తాబేళ్లు ఈ చెత్తను తిని కడుపులో ప్లాస్టిక్ పేరుకుపోవడంతో మృతి చెందుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఓ ఏనుగు ఆకలితో వచ్చి ఆహారం దొరక్కా ఓ చెత్త కుప్పలో పడిఉన్న ప్లాస్టిక్ను తినింది. ఈ ఫోటో వైరల్ అవడంతో చాలామంది జంతుప్రేమికులు బాధపడ్డారు. అంతేకాదు కొన్ని నెలల క్రితం కూడా ఇండోనేషియాలో ఓ సొరచేప సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దాని కడుపులో దాదాపు 6 కేజీల ప్లాస్టిక్ వేస్టు ఉంది.