పాక్ కు షాకిచ్చిన పెంటాగాన్: రూ. 2 వేల కోట్లు స్టాప్
వాషింగ్టన్: పాకిస్తాన్ ఆర్మీకి అమెరికా గట్టి గుణపాఠం చెప్పింది. ఆర్థిక సాయం విషయంలో మీకు సహాయం చెయ్యలేమని తేల్చి చెప్పింది. ఉగ్రవాదులను అణచివేసే విషయంలో మీరు నిర్లక్షం చేస్తున్నందు వలనే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా తెలిపింది.
మిలటరీ రీయింబర్స్ మెంట్ సాయం కింద పాకిస్తాన్ సైన్యానికి రూ. 2009 కోట్లు (300 మిలియన్ డాలర్లు) అందించాల్సి ఉంది. అయితే ఈ మొత్తం మీకు ఇవ్వడం లేదని అమెరికా స్పష్టం చెయ్యడంతో పాక్ ప్రభుత్వానికి చుక్కలు కనపడ్డాయి.
పాకిస్తాన్ లో యథేచ్చగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న హక్కానీ నెట్ వర్క్, ఆఫ్ఘన్ తాలిబన్ ఉగ్రవాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోధ్యం చూస్తుండటంతో అమెరికాకు మండింది.
పాకిస్తాన్ తీరుతో అమెరికాకు చిరాకు వచ్చింది. ఆఫ్ఘన్ తాలిబన్, హక్కానీ నెట్ వర్క్ మీద చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా అందుకు పాక్ ప్రభుత్వం నిరాకరిస్తూ వచ్చింది. ఈ కారణంగా వారికి చేయాల్సిన ఆర్థిక సాయంకు చెక్ పెట్టారు.
ఈ నేథ్యంలో హక్కానీ నెట్ వర్క్ అణచివేత విషయంలో పాక్ చర్యలను ధ్రువీకరిస్తూ ఆమెరికా రక్షణ శాఖ కార్యదర్శి యాష్ కార్టర్ కాంగ్రెస్ (చట్టసభ)కు నివేదిక అందించాల్సి ఉంది. అయితే పాక్ తీరుపై అసంతృప్తిగా ఉన్న రక్షణ శాఖ కాంగ్రెస్ కు ఎలాంటి నివేదిక ఇవ్వకూడదని నిర్ణయం తీసుకుంది.
ఈ దెబ్బతో ఉగ్రవాద నియంత్రణలో భాగంగా కొలియేషన్ సపోర్ట్ ఫండ్ కింద మిత్రదేశాలకు అందించే ఆర్థిక సాయాన్ని ఇప్పుడు పాకిస్తాన్ కు ఇవ్వరాదని అమెరికా రక్షణ శాఖ నిర్ణయించింది. గత 10 సంవత్సరాల నుంచి అమెరికా పాక్ తో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.