'యేల్'కు రూ.334కోట్లకి పైగా ఇంద్రానూయీ విరాళం!
న్యూయార్క్: ప్రవాస భారతీయురాలు, పెప్సీకో కంపెనీ సీఈవో ఇంద్రా నూయీ తాను చదువుకున్న యేల్ విశ్వవిద్యాలయానికి భారీ విరాళం ప్రకటించారు. ఆమె ఎంత ఇచ్చారనేది స్పష్టంగా తెలియనప్పటికీ దాదాపు రూ.334 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువ ఇచ్చి ఉంటారని తెలుస్తోంది.
యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్కు ఇప్పటి దాకా అందిన అతిపెద్ద విరాళం రూ.334 కోట్లు కాగా... ఇంద్రా నూయీ ప్రస్తుతం ఇంతకన్నా ఎక్కువ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
పూర్వ విద్యార్థుల నుంచి వచ్చిన విరాళాల్లో ఇదే అతిపెద్ద మొత్తమని, ఇంద్రా నూయీ ‘అత్యంత ఉదారత గల పూర్వ విద్యార్థి' అని యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా స్కూల్ డీన్షిప్ను ఇంద్రా నూయీ గౌరవార్థం ప్రకటించారు.
ఒక ప్రముఖ బిజినెస్ స్కూల్లో డీన్షిప్ను పొందిన తొలి మహిళగా ఇంద్రా నూయీ రికార్డులకెక్కారు. ఇంద్రా నూయీ 1980లో యేల్ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు.
ఆమె నాటి రోజులు గుర్తు చేసుకుంటూ... ఇప్పటి జీవితానికి పునాది అక్కడే పడిందని, నాయకత్వ నిర్వచనాన్ని విస్తృత స్థాయిలో సమీక్షించడానికి అవకాశం లభించిందని, సమాజాన్ని, వ్యాపారాన్ని కలిపి చూడడం అక్కడే అలవాటైందని ఆమె ఓ ప్రకటనలో చెప్పారు. గతంలోనూ పలు నిర్మాణాలకు ఇంద్రా నూయీ సాయం చేశారు. ఆమె పేరిట ఒక తరగతి గది కూడా అక్కడ ఉంది.