భారత్పై అణుబాంబు వేయాలనుకున్నా కానీ: భయపడి తగ్గిన ముషారఫ్
పాకిస్తాన్ మాజీ సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ భారత్ పైన అణుదాడి చేద్దామని అనుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. భారత్ ఎక్కడ ప్రతీకార చర్యకు దిగుతుందో అనే భయంతో ఆలోచనకు స్వస్తీ చెప్పాడు.
దుబాయ్: పాకిస్తాన్ మాజీ సైనిక నియంత జనరల్ పర్వేజ్ ముషారఫ్ భారత్ పైన అణుదాడి చేద్దామని అనుకున్నాడట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడు. భారత్ ఎక్కడ ప్రతీకార చర్యకు దిగుతుందో అనే భయంతో ఆలోచనకు స్వస్తీ చెప్పాడు.
చదవండి: మా భూభాగంలోకి వచ్చినట్లు అంగీకారం: భారత్కు చైనా షాక్, యుద్ధమే జరిగితే.. అమెరికా అధికారి
ఈ విషయాన్ని జపాన్కు చెందిన పత్రిక మైనిచి షింబున్ వెల్లడించింది. ఆయన ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. 2001లో భారత్ పార్లమెంట్పై దాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అణుదాడిపై నిద్రలేని రాత్రులు
ఆ సమయంలో భారత్పై అణ్వాయుధాలతో దాడి చేయాలనుకున్నానని ముషారఫ్ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. అంతేకాదు అణుదాడి చేయాలా వద్దా అన్న ఆలోచనలతో ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపినట్లు కూడా చెప్పాడు. అణ్వాయుధాల వినియోగంపై అప్పట్లో ముషారఫ్ పబ్లిగ్గానే వ్యాఖ్యలు చేశాడు.
భారత్ ప్రతిదాడికి భయపడి విరమించుకున్నా
అయితే ఆ సమయంలో భారత్గానీ, పాకిస్థాన్గానీ తమ మిస్సైల్స్పై న్యూక్లియర్ వార్ హెడ్స్ను లోడ్ చేసి ఉంచలేదని కూడా ముషారఫ్ చెప్పాడు. అయితే న్యూక్లియర్ వార్ హెడ్స్ను లోడ్ చేసి మిస్సైల్స్ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారా అని ప్రశ్నించగా.. భారత్ నుంచి ప్రతి దాడులకు భయపడి అసలు ఆ ఆలోచనను విరమించుకున్నట్లు ముషారఫ్ తెలిపాడు.
రెండు మూడు రోజుల్లో పూర్తయి ఉండేది
భారత్పై అణుబాంబు ప్రయోగించాలని అనుకున్నప్పటికీ, భారత్ వద్ద కూడా అణు బాంబులు ఉన్న విషయం గుర్తుకు రావడంతో ఆ యోచనను విరమించినట్లు ముషారఫ్ తెలిపాడు. అప్పట్లో క్షిపణులకు అణువార్ హెడ్లను బిగించే సామర్థ్యం లేదు కానీ రెండు మూడురోజుల్లో ఈ కార్యక్రమం పూర్తయివుండేదన్నాడు.
పాకిస్తాన్ ఎందుకు భయపడిందంటే
పాకిస్థాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నప్పటికీ భారత్ వద్ద ఉన్న అణ్వాస్త్రాల సంఖ్య ఎక్కువని పాక్ రక్షణ రంగనిపుణుల భావించారు. భారత్పై ఎలాంటి దాడి జరిగినా నిమిషాల్లోనే పుంజుకొని తిరిగి తిప్పికొట్టగల సామర్థ్యం ఉంది. దీన్ని గ్రహించిన ముషారఫ్ అణుబాంబు దాడికి వెనుకంజ వేసినట్టుగా భావిస్తున్నారు.
నాడు ఇలా
2001లో పార్లమెంటుపై పాక్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు కొందరు దాడి చేశారు. ఈ దాడిని పార్లమెంటు రక్షణ సిబ్బంది అడ్డుకుంది. భారత పార్లమెంటుపై జరిగిన దాడితో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. పాక్కు బుద్ది చెప్పాలనుకున్న భారత ప్రభుత్వం ఆపరేషన్ పరాక్రమ్ పేరిట పాక్ సరిహద్దులకు భారీ ఎత్తున సాయుధ దళాలను తరలించింది. పాక్ కూడా తన దళాలను సిద్ధం చేసింది. దాదాపు యుద్ధం ముంగిట వరకు ఇరుదేశాలు వెళ్లాయి. కానీ కొద్దికాలానికి ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. 2002 జూన్ కల్లా ఇరు దేశాల మధ్య సామరస్య వాతావరణం నెలకొంది.
1999లో నవాజ్ షరీఫ్ను గద్దె దించి పాకిస్తాన్ పగ్గాలను ముషారఫ్ చేపట్టాడు. 2001 నుంచి 2008 వరకు ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఏడాది కాలంగా అతను దుబాయ్లో ఉంటున్నాడు.