దాక్కున్నారు: 'పిల్లల్ని చంపేశాం.. ఏం చేయాలి, మీరే కాల్చుకోండి'
పెషావర్: పాకిస్తాన్లోని పెషావర్ పాఠశాలలో జరిగిన దాడిలో పలువురు విద్యార్థులు గాయాలతో బయటపడి, ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఉగ్రవాదులు తమను కూడా చంపేవారేనని, అదృష్టం కొద్ది వదిలేశారని చెబుతున్నారు. పాకిస్తాన్ తాలిబన్ల పాశవిక దాడి నుంచి బయటపడ్డవారిలో మూడేళ్ల పాప ఈమాన్ ఉంది. జరిగిన దారుణం గురించి వచ్చీరాని మాటల్లో ఆ పాప చెబుతుంటే అందరి హృదయాలూ కదిలిపోయాయి.
వాళ్లు లోపలికి వస్తున్నప్పుడు మా టీచర్ హఫ్సా వాళ్లు చెడ్డవాళ్లు, వెంటనే వెళ్లి బల్ల వెనకాల దాక్కోండి అని చెప్పిందని, తల పైకెత్తి చూడకండని సూచించిందని చెప్పింది. నేను దాక్కున్నానని, ఇంతలో లోపలికి నలుగురు పిచ్చబ్బాయిలు వచ్చారని, వేరే భాషలో గట్టిగా అరిచారని, వాళ్ల చేతుల్లో ఏమున్నాయో తనకు తెలియదుగానీ.. సినిమాల్లో వచ్చేలాంటి శబ్దాలు వచ్చాయని చెప్పిదా పాప. ఆ పాపను దాక్కోమని చెప్పింది వారిని, ఎదిరించి సజీవదహనమైన టీచర్.
చివరికి ఒక మంచబ్బాయి వచ్చి తమకు షేక్ హాండ్ ఇచ్చాడని సైనికుడు కాపాడటం గురించి చెప్పింది. మరో బాలుడికి నుదుడిపై గాయమై, బయటపడ్డాడు. అతను 14 ఏళ్ల విద్యార్థి బకిర్. ప్రాణాలతో బయటపడ్డాడు. మిలిటెంట్లు ఆర్మీ పాఠశాల ఆడిటోరియంలోకి ప్రవేశించి అక్కడ ప్రథమ చికిత్స ట్రైనింగ్లో పాల్గొంటున్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడం ప్రారంభించినప్పుడు తాను ఆడిటోరియంలోని ఓ కుర్చీ కింద దాక్కున్నానని చెప్పాడు.
షాక్, భయంతో మాట పెగల్లేని స్థితిలో ఉన్న బకిర్ ఆ భయానక సంఘటనను గుర్తు చేసుకుంటూ తాను ఆడిటోరియం మధ్యలో ఉన్నానని, మిలిటెంట్లు మొదట వేదికమై నిలుచున్న వారిపై కాల్పులు జరిపిన తర్వాత హాలులో ముందు వరసలో కూర్చుని ఉన్నవాళ్లపై కాల్పులు జరిపారని చెప్పాడు. హంతకుల బారినుంచి తప్పించుకోవడానికి ఓ కుర్చీ కింద దాగిన మా టీచర్పై ఒక దుండగుడు మూడు తూటాలు పేల్చడాన్ని తాను కళ్లారా చూశానని చెప్పాడు.
ముందు వరసలో కూర్చున్న వారిలో చాలామంది టీచర్లే ఉన్నారని, వారిపై కాల్పులు జరిపిన అనంతరం వాళ్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు పెడుతున్న విద్యార్థులపై కాల్పులు జరపడం ప్రారంభించారని బకీర్ తెలిపాడు. బకీర్తో పాటు అదే స్కూల్లో 12వ తరగతి చదువుతున్న అతని అన్న సయ్యద్ సిత్వాల్ అలీ షా కూడా ప్రాణాలతో బైటపడ్డాడు కానీ టీచర్గా పని చేస్తున్న వారి తల్లి సయ్యద్ ఫర్హత్ బీబీ మాత్రం మిలిటెంట్ల చేతిలో బలయ్యారు.
తాము దాక్కున్న వరస వద్దకు ఒక మిలిటెంటు వచ్చినప్పుడు తన పక్కనే దాక్కున్న ఓ విద్యార్థిని చూసి అతని తలపై కాల్పులు జరిపి చంపేసినట్లు బకీర్ చెప్పాడు. తర్వాతి వంతు తనదేనని తాను అనుకున్నానని, అయితే మిలిటెంట్లు పారిపోతున్న మరో విద్యార్థిని వెంబడించడానికి ఆ మిలిటెంట్ పక్క వరసలోకి వెళ్లిపోవడంతో తాను ప్రాణాలతో బైటపడ్డానని బకిర్ చెప్పాడు.
చంపేశాం.. ఏం చేయమంటారు: ముష్కరులు
పాకిస్థాన్ పెషావర్లోని ఆర్మీ స్కూల్లో మారణహోమం సృష్టించిన తాలిబన్ ముష్కరులు తమ హ్యాండ్లర్లతో ఏం మాట్లాడారన్న విషయాన్ని డాన్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. 'ఆడిటోరియంలో ఉన్న పిల్లలందరినీ చంపేశామని, ఏం చేయమంటారని ఓ ఉగ్రవాది వారి హైకమాండ్ అడగగా. 'ఆర్మీవాళ్లు వచ్చేదాకా ఉండండని, వాళ్లని చంపేసి, తర్వాత మిమ్మల్ని మీరు పేల్చుకుని చచ్చిపోండంటూ అటు నుంచి సమాధానం వినిపించిందని డాన్ పత్రిక తెలిపింది.
ఈ విషయం భద్రతాదళానికి చెందిన ఓ అధికారి చెప్పినట్లు పాక్ పత్రిక డాన్ స్పష్టం చేసింది. భద్రతాదళాలు ఉగ్రవాదుల మీద విరుచుకుపడేందుకు కొద్ది నిమిషాల ముందు గోడచాటు నుంచి విన్న మాటలని వారు స్పష్టం చేశారు. దాడులకు పాల్పడినవాళ్లలో ఒకరి పేరు అబుజర్ అని, అతడి కమాండర్ పేరు ఉమర్ అని సైనికులు చెప్పారు. ఉమర్ ఖలీఫా అనే సీనియర్ ఉగ్రవాది, ఫ్రాంటియర్ రీజియన్ పెషావర్ ప్రాంతానికి చెందినవాడని సైనికులు వివరించారు.