అమెరికాతో భారత్ డీల్: 5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ ఒప్పందం
హూస్టన్: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉదయం 16 ఆయిల్ కంపెనీల సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వారం రోజుల అమెరికా పర్యటనలో భాగంగా శనివారం మోడీ హూస్టన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంధన రంగానికి సంబంధించి ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది.
యూఎస్ నాచురల్ గ్యాస్ కంపెనీ టెల్లూరియన్(అమెరికా)-పెట్రోనెట్(భారత్) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏడాదికి 5 మిలియన్ టన్నుల సహజవాయువు కొనుగోలుకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు.
కాగా, ఒప్పందం గురించిన లావాదేవీలు 2020 మార్చి 31 నాటికి తేలనున్నాయి. వీరితో సమావేశం ఫలవంతమైనట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. కాగా, హౌడీ మోడీ కార్యక్రమంలో ఆదివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొననున్న విషయం తెలిసిందే.
అమెరికా ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ భారతీయులనుద్దేశించి ప్రసంగిస్తుండటం గమనార్హం. ఇద్దరు దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొననుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధాని మోడీ ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు.