కౌంటింగ్ సెంటర్పై దాడికి యత్నం: నిందితుడి అరెస్ట్, వాహనంలో ఆయుధాలు సీజ్
పెన్సిల్వేనియా: అమెరికా ఎన్నికలు ప్రశాంతంగానే జరిగాయి. ఎన్నికల ఫలితాల్లో మాత్రం అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో గురువారం రాత్రి ఓట్ల లెక్కింపు జరుగుతుండగా ఓ దుండగుడు దాడికి యత్నించాడు. ఫిలడెల్ఫియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వెంటనే అప్రమత్తమైన పోలీసు బలగాలు అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి,. వర్జీనియా నుంచి వాహనంలో వచ్చిన వ్యక్తులు ఈ దాడికి ప్రయత్నించినట్లు పోలీసులు గర్తించారు. నిందితుడు ప్రయాణించిన వాహనం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మెయిల్ ఇన్ బ్యాలెట్లు లెక్కింపు జరుగుతున్న సమయంలో దాడికి యత్నించడంతో అరెస్ట్ చేశారు. కాగా, పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇప్పటి వరకు 90 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇక్కడ జో బైడెన్ కంటే.. డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతను కనబరుస్తున్నారు.
ఇది ఇలావుంటే, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్న క్రమంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మధ్య పోటీ తీవ్రంగానే ఉంది. అయితే, జో బైడెన్ మెజార్టీ రాష్ట్రాల్లో ఆధిక్యాన్ని సాధించారు.
కాగా, దాదాపు అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఖరారైనట్లేనని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం జో బైడెన్కు భద్రతను పెంచుతున్నట్లు సమాచారం. బైడెన్ భద్రతను పెంచేందుకు అమెరికా సీక్రెట్ సర్వీసు సంస్థ అధికారులను పంపించినట్లు వాషింగ్టన్ పోస్టు తన కథనంలో పేర్కొంది.
విల్మింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా బైడెన్ శుక్రవారం కీలక ప్రసంగం చేసే అవకాశం ఉందని, దీంతో ఆయనకు భద్రత కల్పించేందుకు సీక్రెట్ సర్వీసు ఏర్పాట్లు చేస్తోందని ఈ ప్రణాళికల్లో భాగమైన ఇద్దరు సీనియర్ అధికారులు వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది.
బైడెన్ తన ప్రసంగానికి విల్మింగ్టన్ సెంటర్ను ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆయన ప్రచార వర్గం సీక్రెట్ సర్వీస్కు సమాచారం ఇచ్చిందని.. ఈ క్రమంలోనే భద్రత పెంచే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిసింది. ప్రస్తుతం ఐదు కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ బైడెన్, ట్రంప్ మధ్య తేడా స్వల్పంగానే ఉంది.