24 గంటల్లో రెండోసారి: ఫిలిప్పీన్స్ లో మరోమారు పెను భూకంపం!
మనీలా: ఫిలిప్పీన్స్ లో మరోసారి పెను భూకంపం సంభవించింది. సెంట్రల్ ఫిలిప్పీన్స్ ప్రాంతంలోని సమర్ ద్వీపకల్పంలో మంగళవారం ఉదయం భూమి ప్రకోపించింది. రాజధాని మనీలా నుంచి సుమారు 83 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ద్వీపకల్పం. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 మాగ్నిట్యూడ్ గా నమోదైంది. సోమవారం నాడు సంభవించిన భూకంపంలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 30 మంది అదృశ్యం అయ్యారు. వారంతా మరణించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
ఫిలిప్పీన్స్ లో పెను భూకంపం: కుప్పకూలిన ఆకాశ హర్మ్యాలు: అయిదుమంది మృతి: విమానాశ్రయం మూసివేత
24 గంటల వ్యవధిలో ఫిలిప్పీన్స్ లో భూకంపం చోటు చేసుకోవడం ఇది రెండోసారి. సోమవారం ఉదయం లుజాన్ నగరం శివార్లలో 6.4 తీవ్రతతో భూమి ప్రకంపించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రెండు ఆకాశ హర్మ్యాలు కుప్పకూలిపోయాయి. అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. దీనికి సంబంధించిన సహాయక చర్యలు ఒకవంక ఇంకా కొనసాగుతుండగానే.. ఈ సారి సమర్ ద్వీపకల్పంలో ఇంచుమించు అదే తీవ్రతతో భూకంపం సంభవించింది.
సమర్ ద్వీపానికి చుట్టూ సముద్రం ఉండటం వల్ల సునామీ వచ్చే అవకాశాలు ఉండొచ్చంటూ మొదట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. అలాంటి పరిస్థితి రాలేదు. సునామీ హెచ్చరికలను కూడా అక్కడి ప్రభుత్వం జారీ చేయలేదు. సుమర్ లోని శాన్ జులియన్ పట్టణాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. భూకంప తీవ్రత వల్ల ఓ సూపర్ మార్కెట్ భవన సముదాయం కుప్పకూలినట్లు సమాచారం. ప్రకంపనలు సంభవించిన వెంటనే- క్షణాల్లో జనం రోడ్ల మీదికి చేరుకున్నారు. ఇళ్లు, అపార్ట్ మెంట్ల నుంచి బయటికి పరుగులు తీశారు.
సోమవారం లూజాన్ సిటీలో సంభవించిన భూకంపం అనంతరం.. వరుసగా 400 సార్లు స్వల్పంగా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు రిక్టర్ స్కేల్ పై రికార్డయ్యింది. వాటి తీవ్రత స్వల్పమే కావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. అదే సమయంలో- సమర్ ద్వీపకల్పంలో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. తాజా ప్రకంపనల్లో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించినట్లు వార్తలు రాలేదు. సోమవారం నాటి భూకంప తాకడికి బొడెగా పట్టణంలో ఓ సూపర్ మార్కెట్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు. భవన శిథిలాల మధ్య మరో 30 మంది చిక్కుకున్నారు.