పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం: 91 మంది ప్రయాణికులతో కుప్పకూలిన ఫ్లైట్: జనావాసాల మధ్య
కరాచీ: పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 91 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, పాకిస్తాన్ ఆర్మీ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాలను చేపట్టాయి. సంఘటనా స్థలంలో దట్టమైన పొగ అలముకుంది. విమానం కూలిపోవడానికి ముందు భారీ శబ్దం వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
తెలంగాణలో ఎగ్జామ్స్ ఫీవర్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇదే: పరీక్షా కేంద్రాలు డబల్
కరాచీ విమానాశ్రయం సమీపంలో..
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ)కు చెందిన పీఐఏ ఎయిర్బస్ ఏ320 సుమారు 91 మంది ప్రయాణికులు, సిబ్బందితో లాహోర్ నుంచి బయలుదేరింది. 85 మంది ఎకానమీ క్లాసులో, ఆరుమంది బిజినెస్ క్లాసులో ప్రయాణిస్తున్నట్లు తేలింది. మధ్యాహ్నానికి కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. కరాచీకి చేరుకున్న సమయంలో విమానం ప్రమాదానికి గురైంది. విమానాశ్రయానికి సమీపంలోని మలిర్ మోడల్ కాలనీ సమీపంలో కుప్పకూలిపోయింది.
ల్యాండ్ కావడానికి నిమిషం ముందు..
కుప్పకూలడానికి కొద్దిక్షణాల ముందు చెవులు చిల్లులు పడే శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. కరాచీలో విమానాశ్రయంలో ల్యాండ్ కావడానికి సరిగ్గా నిమిషం ముందే ప్రమాదం సంభవించిందని పాకిస్తాన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. సరిగ్గా నిమిషం ముందు విమానంతో రాడార్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.
Recommended Video
విమానం కుప్పకూలిన సమాచారంతో
విమానం కుప్పకూలిన సమాచారంతో కరాచీవాసులు ఉలిక్కిపడ్డారు. పెద్ద శబ్దం వినిపించినట్లు తెలిపారు. ఆ వెంటనే దట్టమైన నల్లటి పొగ అలముకుందని అన్నారు. సమాచరం అందుకున్న వెంటనే కరాచీ పోలీసు దళం, సైనిక బలగాలు, ఆ దేశ విపత్తు నిర్వహణ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయ కార్యక్రమాలను చేపట్టాయి. జనావాసాల మీద కుప్పకూలడం వల్ల మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో 91 మంది ప్రయాణికులు, ఇతర సిబ్బంది ఉండటంతో వారు జీవించే ఉన్నారా? లేదా? అనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.
ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఇమ్రాన్ ఖాన్
ఇదిలా ఉంటే ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఈ ఘటన తనను షాక్కు గురిచేసిందంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు వెల్లడించారు.ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించిన ఇమ్రాన్ ఖాన్.. తాను పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ సీఈఓ అర్షద్ మాలిక్తో టచ్లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితి గురించి తెలుసుకుంటున్నట్లు చెప్పారు.