'మోడీగారూ 1971 మనుషులం కాదు, ప్రతి పాక్ పిల్లాడు రెఢీ': పావుర సందేశం
న్యూఢిల్లీ: పాక్ - భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీకి సరిహద్దుల అవతల నుంచి హెచ్చరికల సందేశాల పరంపర కొనసాగుతోంది. శనివారం నాడు బెలూన్ల ద్వారా ప్రధాని మోడీకి హెచ్చరికలు పంపించారు.
తాజాగా, ఆదివారం నాడు పావురం హెచ్చరిక సందేశాన్ని మోసుకు వచ్చింది. ఆ పావురాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 'మోడీ గారూ 1971 నాటి (భారత్-పాక్ యుద్ధం) వారిలాగే ఉంటామని అనుకోకండి. ఇప్పుడు ప్రతి ఒక్క పిల్లవాడూ భారత్కు వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడు' అని పావురం తీసుకొచ్చిన కాగితంపై ఉర్దూలో రాసి ఉంది.
బూడిద రంగులో ఉన్న ఈ పావురాన్ని సరిహద్దు భద్రతా దళం బామియల్ సెక్టార్లోని సింబల్ పోస్ట్ వద్ద కనుగొన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు నరోత్ జైమల్ సింగ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు.
మోడీని ఉద్దేశిస్తూ ఉర్దూలో రాసిన సందేశంతో ఉన్న రెండు గాలి బుడగలను శనివారం గుర్దాస్పూర్లోని దీనానగర్కు చెందిన ఘేసల్ గ్రామంలో కనుగొన్న విషయం తెలిసిందే. పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాలో గత నెల 23న ఉర్దూలో రాసిన మాటలతో ఒక పావురాన్ని కనుగొన్నారు. తెల్ల రంగులో ఉన్న ఈ పావురం కూడా సరిహద్దు అవతల నుంచే వచ్చి ఉంటుందని భావించారు.
పాకిస్తాన్ గగనతలంపై విదేశీ విమానాలకు ఆంక్షలు
పాకిస్థాన్ తన గగనతలంలో విదేశీ విమానాల ప్రయాణంపై నియంత్రణలు విధించింది. లాహోర్ మీదుగా వెళ్లే విదేశీ విమానాలు 29 వేల అడుగుల ఎత్తుకు ఎగువనే వెళ్లాలని విమాన చోదకులకు సందేశం పంపింది. అక్టోబరు నెలంతా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించింది. దాంతో గల్ఫ్, యూరప్, అమెరికా దేశాలకు వెళ్లే భారతీయ వాణిజ్య విమానాలు పాకిస్థాన్ గగనతలం మీద కాకుండా చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.