ఎలా నమ్ముతాం, పరిస్థితులు ఇమ్రాన్ ఖాన్ చేతిలో లేకపోవచ్చు: అమిత్ షా
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఎలా నమ్ముతామని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా శుక్రవారం అన్నారు. ఇమ్రాన్ పుల్వామా ఉగ్రవాద దాడిని ఖండించలేదని చెప్పారు. ఉగ్రవాదానికి మద్దతు పలికే వారిలో భయాన్ని కలుగజేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ సఫలమయ్యారని చెప్పారు.
భారత్కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఉగ్రవాదులను ఏరివేసే విషయంలో తమ ప్రభుత్వ ట్రాక్ రికార్డ్ బాగుందని చెప్పారు. తమ ప్రభుత్వం హయాంలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను మట్టుబెట్టామన్నారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పుల్వామా ఉగ్రవాద దాడిని ఖండించలేదని అమిత్ షా చెప్పారు. ఆయనను ఇంకా ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. పరిస్థితులు ఆయన చేతిలో లేకపోయి ఉండవచ్చునని అన్నారు. కనీసం మాట వరుసకైనా ఖండించాల్సిందని చెప్పారు. కొద్ది సమయంలోనే వింగ్ కమాండర్ అభినందన్ను వెనక్కి రప్పించే పరిస్థితులను కలుగజేశామని, ఇది తమ దౌత్య విజయమని చెప్పారు.