కూలిన విమానం: కొద్ది రోజుల్లో పెళ్లి, ఫ్రెండ్స్ సహా మీనా మృతి
టెహ్రాన్: ఓ ప్రైవేట్ టర్కీ విమానం ఇరాన్లో కూలిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృత్యువాత పడ్డారు. యువతులతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి ఇస్తాంబుల్కు బయలుదేరిన విమానం ఆదివారం రాత్రి కూలిపోయింది.
భారీ వర్షం పడుతున్న సమయంలో ఇరాన్లోని పర్వత ప్రాంతాల్లో ఇది కూలిపోయింది. షహర్ - ఎకోర్డు వద్ద విమానం ఓ పర్వతాన్ని ఢీకొట్టింది. దాంతో మంటలు లేచాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
విమానం కూలిన ప్రాంతం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు370 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమానం కూలిన జగ్రోస్ పర్వతాల్లోకి స్థానికులు చేరుకున్నారని, శవాలు పూర్తిగా కాలిపోయిన విషయాన్ని గమనించారని, విమానంలోని ఎవరు కూడా ప్రాణాలతో బయటపడలేదని సమాచారం.
మృతదేహాలను గుర్తించడానికి డిఎన్ఎ పరీక్షలు అవసరం. ఆదివారం సాయంత్రం 4.41 గంటలకు విమానం బయలుదేరిది. సాయంత్రం 6.01 గంటల ప్రాంతంలో విమానంలో లోపమేదో ఉన్నట్లు బయటపడిందని, దాంతో వేగంగా దూసుకెళ్లి కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలిందని చెబుతున్నారు.
ఈ విమాన ప్రమాదంలో పైలట్ సహా మిగతా యువతులంంతా దుర్మరణం పాలయ్యారు. ఇరాన్ గగనతలంపై దాదాపు 35 వేల అడుగుల ఎత్తులో ఉండగా విమానం ప్రమాదానికి గురైంది. విమానాన్ని పైలట్ కిందికి దించే ప్రయత్నం చేయగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత జగ్రోస్ గ్రామ సమీపంలోని ఓ కొండను ఢీకొట్టి విమానం కూలిపోయింది.
మరణంచినవారంతా టర్కీ కేంద్రంగా పనిచేసే బషరన్ బిజినెస్ గ్రూప్ యజమాని కూతురు మినా బషరన్ (28)తో పాటు ఆమె స్నేహితులేనని తెలుస్తోంది. కొద్ది రోజల్లో వివాహం చేసుకోబోతున్న మీనా తన మిత్రులకు షార్జాలో బ్యాచిలర్ పార్టీ ఇచ్చారని, వేడుకలు ముగించుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో విమాన ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
చిన్న వయస్సులోనే వాణిజ్య రంగంలోకి ప్రవేశించిన మీనా టర్కిష్ యూత్ ఐకాన్గా ఉన్నారు. ప్రమాదానికి ముందు ఆమె దిగిన ఫొటోలు టర్కీలో వైరల్ అవుతున్నాయి.