భారత్కు రండి: సూకీకి మోడీ ఫోన్, ఎవరీ ఆంగ్ సాన్?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నాడు నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) అధినేత ఆంగ్ సాన్ సూకీకి శుభాకాంక్షలు తెలిపారు. మయన్మార్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంగ్ సాన్ సూకి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ప్రధాని మోడీ బ్రిటన్ పర్యటనకు వెళ్తున్న సమయంలో ఆమెకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారని, భారత్ రావాలని ఆహ్వానించారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గతవారం జరిగిన మయన్నార్ పార్లమెంట్ ఎన్నికల్లో సూకీ పార్టీ ఎన్ఎల్డీ 536 సీట్లు గెలుపొందింది.
కాగా, ఆదివారం నాటి ఎన్నికల్లో ఈ పార్టీపై ఎన్ఎల్డీ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. 1990 ఎన్నికల్లో సూకీ పార్టీ విజయం సాధించినప్పటికీ ఆ ఎన్నికలను సైనిక పాలకులు రద్దు చేశారు. కానీ ఈసారి ఎన్నికల్లో ఓటమిని వారు అంగీకరించడం గమనార్హం.
అయినప్పటికీ ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దశాబ్దాలుగా ఉద్యమం నడుపుతున్న సూకీ మయన్మార్ పగ్గాలు నేరుగా చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు.
25 శాతం సీట్లు సైన్యానికి కేటాయించడమే కాకుండా విదేశీ పౌరసత్వం కలిగిన జీవిత భాగస్వామి లేదా పిల్లలను కలిగి ఉన్న నేతలెవరూ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులు చేపట్టకుండా సైనిక పాలకులు రాజ్యాంగంలో సవరణలు తెచ్చారు. సూకీ దివంగత భర్త, ఆమె ఇద్దరు పిల్లలు బ్రిటిష్ పౌరులు.
ఈ మెలికను సూకీ ఎలా అధిగమిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఎన్ఎల్డీకి మెజారిటీ వస్తే అధ్యక్ష పదవికి ఒకమెట్టు పైన దేశనాయకురాలిగా పరిపాలన సాగిస్తానని సూకీ తెలిపారు.
ఎన్ఎల్డీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఫలితాల తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎవరూ ప్రత్యర్థి పార్టీవారిని రెచ్చగొట్టే పనులు చేయవద్దని ఎన్ఎల్డీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
సైనిక పాలనపై సూకీ అవిశ్రాంత పోరాటం
ఆధునిక బర్మా సైన్యం వ్యవస్థాపకుడిగా పేరుపొందిన సూకీ తండ్రి ఆంగ్సాన్ 1947లో వలస పాలన నుంచి విముక్తి కోసం బ్రిటిషు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అదే ఏడాది ఆయన హత్యకు గురయ్యారు. అప్పుడు సూకీ వయసు రెండేళ్లు. స్వాతంత్య్రానంతరం 60 దశకంలో సూకీ తల్లి ఖిన్కీ భారత్లో రాయబారిగా పని చేశారు.
ఆ కారణంగా సూకీ విద్యాభ్యాసం భారత్లో కొనసాగింది. తర్వాత లండన్లో పైచదువులు చదువుకున్న సూకీ బ్రిటిష్ పౌరుడైన మైకేల్ ఆరిస్ను పెండ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు ఐక్యరాజ్య సమితిలో పని చేశారు. విదేశాల్లో స్థిరపడ్డ సూకీ 1988లో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసేందుకు మయన్మార్ వచ్చారు.
అప్పటి నుంచి దేశంలోనే ఉంటూ సైనిక పాలనపై పోరాడుతున్నారు. సైనిక పాలనలో మగ్గుతున్న మయన్మార్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఉద్యమం కొనసాగిస్తున్న సూకీని ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాలకు గురి చేసింది. అనేక సంవత్సరాలపాటు గృహనిర్బంధంలో ఉంచింది.
భర్తకూ, పిల్లలకూ దూరమైనా ఆమె తన పోరాటం నుంచి తప్పుకోలేదు. మయన్మార్ ప్రజల అభిమానాన్ని చూరగొన్న సూకీ నేతృత్వంలోని ఎన్ఎల్డీకి 1990లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 59 శాతం సీట్లు లభించాయి. ఆ ఎన్నికలను సైనిక ప్రభుత్వం రద్దు చేసి సూకీని గృహ నిర్బంధంలో ఉంచింది.
అలా నిర్బంధంలో ఉండగానే ఆమెను అనేక అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 1991లో నోబెల్ శాంతి బహుమతికి ఆమె ఎంపికయ్యారు. అయితే ప్రభుత్వం అనుమతించకపోవడంతో అవార్డు ప్రదానోత్సవానికి వెళ్లలేకపోయారు. సూకీ తరఫున ఆమె ఇద్దరు కొడుకులు అవార్డు అందుకున్నారు.