స్వతంత్ర దేశంగా పాలస్తీనా: మోడీ ఆకాంక్ష, ద్వైపాక్షిక చర్చలు ఫలప్రదం, 6 ఒప్పందాలు!
న్యూఢిల్లీ/రామల్లాహ్/అమాన్: పశ్చిమ ఆసియా దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ జోర్డాన్ పర్యటన ముగించుకుని శనివారం పాలస్తీనా చేరుకున్నారు. పాలస్తీనా ప్రధాని రమీ హమదల్లాహ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు.
పాలస్తీనాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని నరేంద్ర మోడీయే. మోడీ రాక సందర్భంగా పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా భారత్ ఎంతో గౌరవప్రదమైన దేశమని కితాబునిచ్చారు. మోడీ పర్యటనతో ఇరు దేశాలమధ్య సత్సంబంధాలు ఏర్పడతాయన్నారు.
ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ పాలస్తీనాలో శాంతియుత వాతావరణం నెలకొనాలని ఆకాంక్షించారు. అంతేకాదు, త్వరలోనే పాలస్తీనాను స్వతంత్ర దేశంగా చూడాలని ఆయన అభిలషించారు. పాలస్తీనా అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తాన్నారు.
యాసర్ అరాఫత్ సమాధి వద్ద నివాళి
శనివారం పాలస్తీనా చేరుకున్న ప్రధాని మోడీ తొలుత ఆ దేశ ప్రధానితో కలిసి పాలస్తీనా నేత యాసర్ అరాఫత్ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం ప్రధాని నరేంద్రమోడీ, పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ పలు ద్వైపాక్షిక అంశాలు, అంతర్జాతీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మొత్తం 6 ఒప్పందాలపై వారు సంతకాలు చేశారు. దాదాపు 50 మిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. అందులో 30 మిలియన్ డాలర్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించే ఒప్పందం కూడా ఉంది. 5 మిలియన్ డాలర్లు విద్యారంగం కోసం, మరో 5 డాలర్లు మహిళా సాధికారిత కోసం సెంటర్ నిర్మించడం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అనంతరం ఇరు దేశాల నేతలు ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మోడీ తన పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రానికి అబుదాబి చేరుకుంటారు.
జోర్డాన్లో మోడీకి ఘన స్వాగతం...
అంతకుముందు జోర్డాన్ పర్యటనలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. జోర్డాన్ రాజధాని అమాన్లో దిగిన ప్రధాని మోడీని ఆ దేశ ప్రధాని హని అల్-ముల్కి సాదరంగా ఆహ్వానించి రాజప్రసాదానికి తీసుకెళ్లారు. అక్కడ జోర్డాన్ రాజు అబ్దుల్లా-2 ప్రధాని మోడీని ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మోడీ మాట్లాడుతూ భారత విదేశీ సంబంధాలలో పశ్చిమాసియాకు కీలక పాత్ర ఉందన్నారు. రాజు అబ్దుల్లా-2తో చర్చలు ఫలప్రదంగా ముగిశాయని చెప్పారు.
మువ్వన్నెల కాంతుల్లో..
ప్రధాని నరేంద్ర మోడీ పశ్చిమాసియా దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసింది. ఈ సందర్భంగా దుబాయ్లోని ప్రముఖ నిర్మాణాలు భారత జాతీయ జెండా రంగుల్లో విద్యుత్ కాంతులీనుతున్నాయి. మోడీ పర్యటన సందర్భంగా యూఏఈ, అబుదాబిలోని అడ్నాక్ బిల్డింగ్, ఎమిరేట్స్ ప్యాలెస్, దుబాయ్లోని బుర్జు ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్స్ మన త్రివర్ణ పతాకం రంగులను సంతరించుకున్నాయి. ఈ విషయాన్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కు భారత రాయబారి నవదీప్ సూరి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.
మోడీని సత్కరించిన పాలస్తీనా అధ్యక్షుడు...
శనివారం భారత్, పాలస్తీనా దేశాల మధ్య పలు ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్.. పాలస్తీనా గౌరవానికి సూచిక అయిన హారాన్ని మోడీకి బహుమానంగా ఇచ్చారు. ఈ హారాన్ని ‘గ్రేట్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా'గా వ్యవహరిస్తారు. విదేశాల నుంచి వచ్చిన రాజులు, అధ్యక్షులు, ప్రధానులు, ముఖ్యమంత్రులకు దీనిని బహుకరించడం ఆనవాయితీ. ఇప్పటి వరకు ఈ హారాన్ని సౌదీ అరేబియా రాజు సల్మాన్, బహ్రెయిన్ రాజు హమాద్, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్కు బహుకరించారు. ఇప్పుడు తొలిసారిగా భారత ప్రధాని హోదాలో పాలస్తీనాకు విచ్చేసిన నరేంద్ర మోడీకి దీనిని బహుకరించారు.
పాలస్తీనా ప్రజలు అభినందనీయులు: ప్రధాని మోడీ
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ తమ విదేశాంగ విధానాల్లో పాలస్తీనాకే ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. పాలస్తీనా ప్రజలు విపత్కర పరిస్థితుల్లోనూ దైర్యం కోల్పోకుండా నిలబడటం అభినందనీయం అంటూ ప్రధాని కొనియాడారు. పాలస్తీనాలో దౌత్య కార్యాలయం నిర్మాణం కోసం భారత్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు. ఈ పర్యటనలో రెండు దేశాల అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని చూసి తాను ఎంతో సంతోషపడుతున్నానన్నారు. ఈ సంవత్సరం నుంచి ఇండియాకు వచ్చే పాలస్తీనా విద్యార్థుల సంఖ్యను 50 నుంచి 100కు పెంచుతున్నానన్నారు.