ఇండియన్ అమెరికన్లపై ట్రంప్ భారీ ఆశలు... అధ్యక్ష ఎన్నికల్లో తనకే ఓటేస్తారని...
నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్స్ తనకే ఓటు వేస్తారని భావిస్తున్నానని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ నుంచి, ఆ దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తమకు గొప్ప మద్దతు ఉందని... కాబట్టి ఇండియన్ అమెరికన్లు తనకే ఓటు వేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. వైట్ హౌజ్లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్లో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని.. ఆయన పాలన చాలా బాగుందని ట్రంప్ కితాబిచ్చారు. గత ఏడాది సెప్టెంబర్లో అమెరికాలో జరిగిన 'హౌడీ మోడీ' కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ట్రంప్ గుర్తుచేసుకున్నారు. 'మీ అందరికీ తెలుసు గతంలో హోస్టన్లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ భారీ ఈవెంట్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ నన్ను ఆహ్వానించారు. భారత్ నుంచి మనకు గొప్ప మద్దతు ఉంది. అలాగే మోదీ నుంచి కూడా మనకు గొప్ప మద్దతు ఉంది.' అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన ఇండియా పర్యటన గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. కరోనా మహమ్మారికి ముందు జరిగిన ఆ పర్యటన చాలా అద్భుతంగా సాగిందని... భారత్ ఓ అద్భుతమని పేర్కొన్నారు.
ఇండియన్ అమెరికన్లలో ఎక్కువగా పాపులర్ అయిన ఇవాంకా ట్రంప్,డొనాల్డ్ ట్రంప్ జూనియర్,కింబర్లీ గిల్ఫోయిల్లతో మీ తరుపున ప్రచారం చేయిస్తారా..? అని ఓ జర్నలిస్ట్ ట్రంప్ను ప్రశ్నించారు. దీనికి ట్రంప్... 'నాకు తెలుసు.. వారికి భారత్తో మంచి సంబంధాలున్నాయి..' అని పేర్కొన్నారు. అయితే వారితో ప్రచారం చేయించేది లేనిది మాత్రం చెప్పలేదు.
గత కొద్దివారాలుగా అటు డెమోక్రాట్స్,ఇటు రిపబ్లికన్లు ఇరువురు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీని ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సాంప్రదాయకంగా డెమోక్రాటిక్ పార్టీకి ఓటు వేసే భారతీయ-అమెరికన్లు నవంబర్ 3 ఎన్నికల్లో మాత్రం రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవలి మాసన్ సర్వే వెల్లడించింది. భారత ప్రధాని మోదీతో,అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఉన్న మిత్రుత్వమే దీనికి కారణమని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్,ఆయన క్యాంపెయినర్స్ ఇటీవలి ప్రచారాల్లో పదేపదే ఇండియన్ అమెరికన్ల మద్దతు కోసం విజ్ఞప్తి చేస్తున్నారు.