ఎస్సీఓలో ప్రధాని మోడీ ‘సెక్యూర్’ సందేశం: పాక్ అధ్యక్షుడితో కరచాలనం
చింగ్డావ్: చైనాలోని చింగ్డావ్ వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. పొరుగుదేశాలతో అనుసంధానానికి భారత్ అధిక ప్రాధాన్యమిస్తోందని నరేంద్ర మోడీ చెప్పారు.
'భారత్ సెక్యూర్(SECURE) విధానానికి కట్టుబడి ఉంటుంది. ఇందులో S అంటే పౌరుల భద్రత, E అంటే ఆర్థిక వృద్ధి, C అంటే ప్రాంతాల వారీగా అనుసంధానం, U అంటే ఐకమత్యం, R అంటే సౌభ్రాతృత్వం, సమగ్రతకిచ్చే గౌరవం, E అంటే పర్యవరణ పరిరక్షణ' అని మోడీ వివరించారు. పొరుగుదేశాలతో, ఎస్సీవో ప్రాంతంలోని దేశాలతో అనుసంధానానికి భారత్ ప్రాధాన్యమిస్తోందని ఆయన చెప్పారు.
ఈ సదస్సు విజయవంతం అవడానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. భారత్లో పర్యాటకానికి కూడా అధిక ప్రాధాన్యమిస్తామని మోడీ చెప్పారు. ప్రస్తుతం ఎస్సీఓ దేశాల నుంచి భారత్కు వచ్చే పర్యాటకుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, దీన్ని రెట్టింపు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు పొరుగు దేశాల సహకారం అవసరమన్నారు.
ఈ సందర్భంగా అఫ్గానిస్థాన్ గురించి కూడా మోడీ ప్రస్తావించారు. రంజాన్ సందర్భంగా ఆఫ్గాన్లో కాల్పులు విరమణ ఒప్పందం ప్రకటించడం మంచి నిర్ణయమని.. ఆ దేశంలో శాంతిని నెలకొల్పేందుకు అది ఎంతగానో దోహదపడుతుందన్నారు.
కాగా, సమావేశంలో భాగంగా పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్తో ప్రధాని మోడీ కరచాలనం చేశారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. కాగా, ఎస్సీఓ సదస్సులో భారత ప్రధాని పాల్గొనడం ఇదే తొలిసారి. ఇటీవలే ఈ సదస్సులో భారత్, పాక్ పూర్తిస్థాయి సభ్యత్యం పొందాయి.