నా లక్ష్యం అదే: మోడీ, ఖజురహో ఆలయ శిల్పం గిఫ్ట్గా ఇచ్చిన కెనడా ప్రధాని
టోరంటో: తన లక్ష్యం నైపుణ్యం కలిగిన భారత్ అని, కుంభకోణాల భారత్ కాదని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం అన్నారు. విదేశీ పర్యటనలో భాగంగా మోడీ మాట్లాడుతూ.. భారత్లో కొత్త విశ్వాసం వచ్చిందన్నారు. తన పది నెలల పాలన నేపథ్యంలో అభివృద్ధి సాధిస్తామనే నమ్మకం ఏర్పడిందన్నారు. మోడీ బుధవారం రాత్రి టోరంటోలోని రికో కోలీజియంలో దాదాపు పదివేల మంది భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు.
తమ ప్రభుత్వం దేశంలో నాలుగు విప్లవాలకు కృషి చేస్తోందని వివరించారు. ఇంధన రంగంలో కాషాయ విప్లవం, పశుపోషణరంగం అభివృద్ధి కోసం శ్వేత విప్లవం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు హరితవిప్లవం, పర్యావరణ ప్రమాదాల నివారణకు నీలివిప్లవం తీసుకువస్తామన్నారు. తమ లక్ష్యాలను దశల వారీగా సాధిస్తామన్నారు.
అంతకుముందు, భారత్కు యురేనియమ్ సరఫరా చేయడానికి కెనడా అంగీకరించిన నేపథ్యంలో మోడీ మాట్లాడుతూ.. భారత్-కెనడా సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. భారత్కు సహాయం చేయడానికి ప్రపంచ దేశాలు చొరవ చూపించడానికి ముందు నుంచే కెనడాకు భారత్కు స్నేహహస్తం అందిస్తోందన్నారు. ప్రస్తుతం భారత దేశం కొత్త మార్పులకు సిద్ధమవుతోందని దేశమంతటా ఆశావాదం పెరుగుతోందన్నారు.
అరుదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు
ప్రధాని మోడీ, కెనడా ప్రధాని స్టీఫెన్ హార్బర్లు అరుదైన కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. సిక్కులు గురువు గురునానక్ ఇద్దరు శిష్యులతో ఉన్న పెయింటింగును మోడీ కెనడా ప్రధానికి ఇచ్చారు. జైపూర్కు చెందిన వీరేంద్ర భాను ఈ పెయింటింగ్ వేశారు. ఈ పెయింటింగులో గురునానక్, ఆయన శిష్యులు భాయ్ మార్దానా, భాయ్ బాలా చెరోవైపు ఉంటారు.
కెనడా ప్రధాని స్టీఫెన్ మన ప్రధాని మోడీకి భారత్లోని ఖజురహో ఆలయానికి చెందిన 900 ఏళ్ల నాటి అరుదైన శిల్పం ఇచ్చారు. ఇది కెనెడాలో ఉండగా.. దానిని మోడీకి బహూకరించారు. కెనడా పార్లమెంటు లైబ్రరీని సందర్శించిన అనంతరం మోడీకి స్టీఫెన్ దీనిని ఇచ్చారు.