ఐ ఫర్ ఐ: గొప్ప గౌరవమంటూ ఇజ్రాయెల్లో మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన బిజీబిజీగా సాగుతోంది.మంగళవారం ప్రధానితో భేటీ అయిన మోడీ.. బుధవారం ఆ దేశాధ్యక్షుడు రూవెన్ రవ్లిన్తో సమావేశమయ్యారు.
జెరూసలెం: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. మంగళవారం ప్రధానితో భేటీ అయిన మోడీ.. బుధవారం ఆ దేశాధ్యక్షుడు రూవెన్ రవ్లిన్తో సమావేశమయ్యారు. అధ్యక్ష భవనానికి చేరుకున్న మోడీని.. రూవెన్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.
'ఇజ్రాయెల్ అధ్యక్షుడు రూవెన్ ప్రొటోకాల్ను పక్కనబెట్టి మరీ.. హృదయపూర్వకంగా నన్ను స్వాగతించారు. భారత ప్రజలకు అందుతున్న గౌరవానికి ఇదే నిదర్శనం' అని మోడీ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య బంధం 'ఐ ఫర్ ఐ' అని అన్నారు. అంటే.. ఇండియా కోసం ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ కోసం ఇండియా అని చెప్పుకొచ్చారు.
ఇజ్రాయెల్ అధ్యక్షుడిని కలవడం గొప్పగా భావిస్తున్నానని చెప్పారు. అనంతరం రూవెన్ మాట్లాడుతూ.. భారత్లో తన పర్యటనను ఎన్నడూ మర్చిపోలేనని, అదో మధురమైన జ్ఞాపకమని అన్నారు. అనంతరం ఇరువురు నేతలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు.
కాగా, ప్రధాని మోడీ మూడు రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ముంబై పేలుళ్ల నుంచి ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి మోషేను మోడీ కలవనున్నారు. ఆ తర్వాత భారత కమ్యూనిటీ సమావేశంలో ప్రసంగిస్తారు. ఇజ్రాయెల్ నుంచి మోడీ జర్మనీ వెళ్లనున్నారు. అక్కడ జులై 7, 8 తేదీల్లో జరిగే జీ 20 సదస్సులో పాల్గొంటారు.
The President of Israel welcomed me so warmly, he broke protocol. This is a mark of respect for the people of India: PM @narendramodi pic.twitter.com/r6eFdlrYwz
— PMO India (@PMOIndia) July 5, 2017
ప్రధానికి అరుదైన కానుకలు
కాగా, మంగళవారం భేటీ సందర్భంగా నెతన్యాహుకు ప్రధాని మోడీ అరుదైన కానుకలు అందజేశారు. భారత్లో ఆనాటి యూదులచరిత్రకు సంబంధించిన కళాఖండాలను మోడీ బహుమతిగా ఇచ్చారు. మొదటిది కేరళలోని కొచ్చిన్లో యూదుల చరిత్రను తెలిపే రాగిపలకల ప్రతిరూపం.
రెండోది భారతలోని యూదుల వ్యాపారాలను తెలిపే డాక్యుమెంట్తో కూడిన రాగిపలకల ప్రతిరూపం. వీటితో పాటు కేరళలోని పరదేశీ యూదుల సంఘం విరాళంగా ఇచ్చిన తోరా, బంగారంతో పూత పూసిన కిరీటాన్ని మోడీ.. నెతన్యాహుకు కానుకగా ఇచ్చారు. మోడీ కానుకల పట్ల నెతన్యాహు హర్షం వ్యక్తం చేశారు.