మయన్మార్ పర్యటనలో మోడీ, అంగ్ సాన్ సూకీతో భేటీ, రోహింగ్యా ముస్లింలపై చర్చ?
మయన్మార్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ దేశ కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూకీతో భేటీ అయ్యారు. వీరి మధ్య రోహింగ్యా ముస్లిం శరణార్థులతోపాటు పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
బర్మా: మయన్మార్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఆ దేశ కౌన్సెలర్ ఆంగ్ సాన్ సూకీతో భేటీ అయ్యారు. వీరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
భారత కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం చైనా పర్యటన ముగించుకున్న నరేంద్ర మోడీ అక్కడి నుంచి మయన్మార్ బయలుదేరి వెళ్లారు. మోడీకి మయన్మార్ అధ్యక్షుడు టిన్ క్యా ఘన స్వాగతం పలికారు.
రక్షణ, తీవ్రవాదం అణచివేత, వాణిజ్యం-పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఇంధన శక్తి, సాంస్కృతిక తదితర రంగాల్లో పరస్పర సహకారంపై మయన్మార్ ప్రభుత్వంతో చర్చించనున్నట్లు పర్యటనకు వెళ్లే ముందు మోడీ వెల్లడించారు.
ముఖ్యంగా రోహింగ్యా ముస్లింల సమస్యపై ఇరువురు నేతలు చర్చించనున్నట్లు సమాచారం. మయన్మార్ నుంచి రోహింగ్యాలు పొరుగు దేశాలకు వలస వెళ్లిపోవడానికి గల కారణాల గురించి మోడీ చర్చించనున్నారు.
మయన్మార్ ప్రభుత్వ దళాల చేతిలో చిత్రహింసలకు గురవుతున్న రోహింగ్యాలు ప్రాణభయంతో భీతిల్లిపోతున్నారు. బతుకు జీవుడా అంటూ పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం భారత్లో ఉన్న రోహింగ్యాలను మళ్లీ మయన్మార్లోకి అనుమతించాల్సిందిగా ఆంగ్ సాన్ సూకీని మోడీ కోరనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం భారత్లో సుమారు 40 వేల మంది రోహింగ్యాలు అక్రమంగా నివసిస్తున్నారు. వీరంతా మయన్మార్ నుంచి వలస వచ్చిన వారే. కాబట్టి వీరిని మయన్మార్లోకి తిరిగి అనుమతించాలని సూకీకి.. ప్రధాని మోడీ సూచించనున్నట్లు సమాచారం.
మోడీ, సూకీ.. సమావేశంపై విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఒక ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ విలువైన స్నేహితురాలు అంగ్ సాన్ సూకీని కలుసుకున్నారంటూ ఆ ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు.