సంస్కరణలు, పేదరికంపై పోరు: ఐరాసలో మోడీ
న్యూయార్క్: మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్య సమితిని తీర్పిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు. ప్రస్తుత ప్రపంచ వ్యవహారాల్లో ఐరాస తనదైన ముద్ర వేస్తూ విశ్వాసం కల్పించాలన్నా, ఔచిత్యాన్ని కలిగి ఉండాలన్నా భద్రతామండలిలో సంస్కరణలు తప్పనిసరి అని చెప్పారు.
ఐక్యరాజ్యసమతి సర్వ ప్రతినిధి సభ సమావేశాన్ని ఉద్దేశించి మోడీ శుక్రవారం ప్రసంగించారు. '70 ఏళ్ల కిందట భయానకమైన రెండో ప్రపంచయుద్ధం ముగింపు దశకు వచ్చినప్పుడు.. ప్రపంచ ప్రజల ఆశలను చిగురింపజేస్తూ ఐరాస ఆవిర్భవించింది. ప్రస్తుతం మనం ఒక కొత్త దిశను నిర్దేశించటానికి ఇక్కడ సమావేశమయ్యాం' అని మోడీ పేర్కొన్నారు.
పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిండమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని విద్యా, నైపుణ్య అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తోందని మోడీ అన్నారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు, భారత్ ఎంచుకున్న అభివృద్ధి ప్రాధాన్యతల మధ్య ఎంతో సారూప్యత ఉండడం తమ దేశ ప్రజలకు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు.
పర్యావరణ మార్పులను నిరోధించే అంశంపై మాట్లాడిన మోడీ ‘నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించుకోవల్సిన అవసరం ఎంతో ఉంది' అని అన్నారు. తమ ప్రభుత్వం జాతీయ స్థాయిలోచేపట్టిన కార్యక్రమాలు అన్నీకూడా సమగ్రమైన, సుస్థిరమైన, అర్ధవంతమైన అభివృద్ధికి దోహదం చేసేవేనని ప్రధాని చెప్పారు.
ప్రస్తుత ప్రపంచం పరస్పర అనుసంధానమైన దేశాలతో కూడుకున్నదని వెల్లడించిన మోడీ, అన్ని దేశాలు కూడా అనేక రకాలుగా ఇతర దేశాలపై ఆధారపడ్డావేనని పేర్కొన్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యం అన్నది మానవీయ దృక్కోణ ప్రాతిపదికగానే శక్తివంతం కావల్సిన అవసరం ఎంతో ఉందని, ప్రపంచ దేశాలన్నీ ఒక్క కుటుంబంగా పనిచేసినప్పుడే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని వెల్లడించారు.
వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా ఉత్పత్తిదాయకంగా మార్చేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు అలాగే ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని ఆయన తెలిపారు.
ప్రపంచ దేశాలన్నీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం గురించి మాట్లాడుతుంటే తమ ప్రభుత్వం వ్యక్తిగత రంగంపైనే దృష్టిపెట్టిందని అన్ని రంగాల్లోనూ కొత్త ఆలోచనలను పాదుగొల్పేందుకు ప్రయత్నిస్తోందని మోడీ స్పష్టం చేశారు.
ప్రతి ఒక్కర్నీ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలన్న ఉదాత్త లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. అలాగే భూమాతగా పుడమని భావించే సంస్కృతికి తాము పెద్ద పీట వేస్తున్నామని మోడీ చెప్పారు. భారత దేశంలోని అన్ని పట్టణాలను స్మార్ట్ సిటీలుగా మారుస్తున్నామని ఆ విధంగా సుస్థిర అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తున్నామని అన్నారు.
సుస్థిర అభివృద్ధి సదస్సులో ప్రసంగించడానికి ముందుగా ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్తో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సమావేశమయ్యారు. ఐరాసతో భారత అనుబంధంపై ఒక పుస్తకాన్ని ఈ సందర్భంగా మూన్కు మోడీ బహూకరించారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్శశి కూడా మోడీతో సమావేశమయ్యారు.