ఇమ్రాన్ ఖాన్ యుద్ధోన్మాదం, భారత్ ‘కాశ్మీర్’పై అక్కసు: ఆర్ఎస్ఎస్, మోడీపై తీవ్ర వ్యాఖ్యలు
న్యూయార్క్: తమది ఉగ్రవాద దేశంగా భారత్ ఎప్పుడూ ఆరోపిస్తుందని.. అయితే, తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద సంస్థలు లేవని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి చిలక పలుకులు పలికారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల్లో శుక్రవారం ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. భారత్పై మరోసారి తన అక్కసును వెల్లగక్కారు.
మోడీ ఆర్ఎస్ఎస్ సభ్యుడంటూ తీవ్ర వ్యాఖ్యలు
ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ సభ్యుడు. అడల్ఫ్ హిట్లర్, బెనిటో ముస్సోలినీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నదే ఆర్ఎస్ఎస్ అని అన్నారు. భారతదేశంలో ముస్లీంలను లేకుండా చేసేందుకే ఈ సంస్థ పనిచేస్తోందని అన్నారు. ఈ ధ్వేషమే గాంధీని చంపేసింది. ఆర్ఎస్ఎస్ క్యాంపుల్లోనే ఉగ్రవాదులు తయారవుతున్నారని ఓ కాంగ్రెస్ మంత్రి చెప్పారని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం కొనసాగుతోందని అన్నారు.
కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికే..
కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికే తాను ఇక్కడికి వచ్చానని ఇమ్రాన్ ఖాన్ చెప్పుకొచ్చారు. కాశ్మీర్లో యువకులు ప్రాణాలు కోల్పోవడానికి ఎవరు కారణమంటూ దొంగ ఏడుపులు ఏడ్చారు. తాము ఎందుకు కాశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపుతామని, తమకు ఆ అవసరం ఏముందని ప్రశ్నించారు.తమను ఉగ్రదేశంగా భారత్ చిత్రీకరిస్తోందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.
ఇమ్రాన్ యుద్ధోన్మాదం..
అణ్వాయుధ దేశం యుద్ధానికి దిగితే దాని ఫలితం సరిహద్దులు దాటి ఉంటుందని, ఈ సందర్భంగా భారత్ తోపాటు ప్రపంచాన్ని హెచ్చరించారు ఇమ్రాన్ ఖాన్. ఇది తాను బెదిరించడానికి చెప్పడం లేదని.. ఐక్యరాజ్యసమితి కర్తవ్యాన్ని గుర్తు చేసేందుకు చెబుతున్నానని యుద్ధోన్మాదాన్ని వ్యక్తం చేశారు.
విషం కక్కిన ఇమ్రాన్
పాకిస్థాన్కు గుణపాఠం చెబుతామంటూ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారంటూ చెప్పుకొచ్చారు. జమ్మూకాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసి ప్రశాంతతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ముస్లింలు యువకులను ఉగ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ విషం కక్కారు ఇమ్రాన్ ఖాన్. జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఆరోపించారు. తన వ్యాఖ్యల ద్వారా ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి తన దొంగబుద్ధిని చాటుకున్నారు ఇమ్రాన్ ఖాన్.