హ్యూస్టన్ నుంచి హైదరాబాద్ దాకా: వన్ ఇండియా..మెనీ లాంగ్వేజెస్: తెలుగులో మోడీ పలకరింపు
హ్యూస్టన్: వన్ ఇండియా.. వన్ లాంగ్వేజ్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ మధ్యకాలంలో బలంగా చెబుతున్న మాట ఇది. ఒకే దేశం.. ఒకే భాషను ప్రజలు మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ చెబుతున్నారు. అన్ని రాష్ట్రాలు హిందీని అమలు చేయాలని ఆయన సూచన ప్రాయంగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు. అంతా బాగుంది.. అనే పదాన్ని ఎనిమిది భాషల్లో పలికారు. ప్రవాస భారతీయులను ఆత్మీయంగా పలకరించారు. నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్ లోని ఎన్ఆర్జీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హౌడీ మోడీ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భారత్ అంతా బాగుంది.. అనే పదాన్ని ఆయన వేర్వేరు భాషల్లో ఉచ్ఛరించారు.
అంతా బాగుందంటూ..
స్టేడియంలోనికి ప్రవేశించిన కొద్దిసేపటి తరువాత మొదట హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతరం భారత్ లో అంతా బాగుంది.. అనే పదాన్ని గుజరాతీ, తెలుగు, తమిళం, మరాఠీ, కన్నడ, పంజాబీ, బెంగాలీ, భోజ్ పురి భాషల్లో ఉచ్ఛరించారు. అమెరికాతో భారత్ కు ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఈ రెండు దేశాల్లో ఉన్న ప్రధాన నగరాల పేర్లను ఉటంకించారు. హ్యూస్టన్ నుంచి హైదరాబాద్ వరకు, బోస్టన్ నుంచి బెంగళూరు వరకు, చికాగో నుంచి షిమ్లా వరకు, లాస్ ఏంజెలిస్ నుంచి లూధియానా వరకు, న్యూజెర్సీ నుంచి న్యూఢిల్లీ.. అంటూ తన భాషా చాతుర్యాన్ని ప్రదర్శించారు.
130 కోట్ల భారతీయులందరూ నా కుటుంబీకులే
అమెరికా, భారత్ మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు మాత్రమే కాదని, దానికి మించిన అనుబంధం ఉందని అన్నారు. తాను మొదటిసారి వైట్ హౌజ్కు వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్.. తనకు ఆయన కుటుంబాన్ని పరిచయం చేశారని, ఇప్పుడు తన కుటుంబాన్ని ఆయనకు పరిచయం చేస్తానని అన్నారు. `వీళ్లే నా కుటుంబం.. 130 కోట్ల భారతీయులందరూ నా కుటుంబీకులే..` అంటూ డొనాల్డ్ ట్రంప్ కు పరిచయం చేశారు.
అబ్ కి బార్.. ట్రంప్ సర్కార్..
అనేక భాషలు, అనేక జాతులు.. దానితో పాటు భిన్న సంస్కృతి మన దేశంలో అంతర్భాగమని.. దాని వల్లే మన దేశానికి ప్రపంచంలో ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చిందని మోడీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్ ప్రత్యేకత అని చెప్పారు. అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఆయన ప్రశంసల్లో ముంచెత్తారు. అమెరికా ఆర్థిక విధానాన్ని డొనాల్డ్ ట్రంప్ బలోపేతం చేసిన తీరు అద్భతమని వ్యాఖ్యానించారు.
సంబంధాలు మరింత పటిష్టం
ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా.. అదే స్థానంలో కొనసాగడానికి ట్రంప్ చేయాల్సినదంతా చేస్తున్నారని అన్నారు. మరోసారి ట్రంప్ ను గెలిపించాలనే అర్థం వచ్చేలా `అబ్ కి బార్.. ట్రంప్ సర్కార్` అనే నినాదాన్ని వినిపించారు. ట్రంప్ హయాంలో భారత్ అమెరికా మధ్య ఉన్న సంబంధాలు మరింత పటిష్టం అయ్యాయని అన్నారు. ఈ బంధం చిరకాలం కొనసాగాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడే రెండు దేశాలు పురోగమిస్తాయని చెప్పారు.
ప్రజలే మూలాధారం..
ఏ దేశమైనా, ఏ రంగంలోనైనా సమగ్ర నైపుణ్యాన్ని, పరిపూర్ణ అభివృద్ధిని సాధించాలంటే ప్రజల నుంచి ప్రభుత్వానికి సహకారం లభించాల్సి ఉంటుందని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తాను అనుకున్నది సాధించారని అన్నారు. స్వదేశాన్ని అన్ని రంగాల్లోనూ బలోపేతం చేయడానికి ట్రంప్ చేస్తోన్న ప్రయత్నాలు అనితర సాధ్యమని చెప్పారు. స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత సుమారు 60 సంవత్సరాల తరువాత భారత్ లో బలమైన ప్రభుత్వం ఏర్పడిందని, దీనికి ప్రధాన కారణం ప్రజలేనని అన్నారు.
మాకు మేమే పోటీ
ప్రస్తుతం తమకు పోటీదారులంటూ ఎవరూ లేరని, తమకు తామే పోటీ అని మోడీ చెప్పుకొచ్చారు. ప్రజల సహకారంతో, ప్రజా మద్దతుతో అనుకున్న ప్రతి కార్యాన్నీ సాధించగలమనే ఆత్మవిశ్వాసం తనలో ఉందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన సందర్భాన్ని ఆయన దీనికి ఉదాహరణగా ప్రస్తావించారు.