మోడీ సాహసం: 'రాన్ ఆఫ్ కచ్' టెంట్లలో మూడ్రోజులు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో సాహసం చేయనున్నారు. భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీ.... ప్రధాని హోదాలో మొదటి దీపావళిని పురస్కరించుకుని భారత సైనికులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న జమ్మూ కాశ్మీర్ వెళ్లారు.
ఆ తర్వాత దీపావళిని పంజాబ్లోని అమృత్సర్లో సైనికులతో జరుపుకున్నారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల్లో ఆయన ధైర్యంగా పర్యటించారు. తాజాగా, మోడీ మరో సాహసానికి సిద్ధమయ్యారు. రాష్ట్రాల డీజీపీ సమావేశాలను పాకిస్థాన్ సరిహద్దు వద్ద నిర్వహించేందుకు ఆయన పచ్చజెండా ఊపారు.
డిసెంబర్ 18వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు తొలి రోజు నుంచి చివరి రోజు దాకా ప్రధాని మోడీ హాజరవుతారు. మూడో రోజు సమావేశాల ముగింపు సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం చేస్తారని తెలుస్తోంది.
పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని తన సొంత రాష్ట్రం గుజరాత్లోని 'రాన్ ఆఫ్ కచ్' వద్ద జరగనున్న ఈ సమావేశాల్లో, అక్కడే సైన్యం ఏర్పాటు చేసే టెంట్లలో ప్రధాని మోడీ బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాన్ ఆఫ్ కచ్ను ఆ మూడు రోజుల పాటు నో ఫ్లయింగ్ జోన్గా సైన్యం ప్రకటించనుంది. డ్రోన్ ల సంచారాన్ని కూడా నిషేధించారు.