ఈస్టర్ సండే బాధితులకు మోడీ నివాళి .. మైత్రిపాలతో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
న్యూఢిల్లీ : ఈస్టర్ సండే రోజున జరిగిన నరమేధాన్ని గుర్తుచేసుకొని శ్రీలంక ఇప్పటికీ వణికిపోతోంది. ఆ తర్వాత దేశంలో భయానక వాతావరణం నెలకొంది. ఇప్పటికీ పరిస్థితులు మెరుగపడలేదు. అప్పటినుంచి ఓ విదేశీ అధినేత లంక గడ్డపై అడుగుపెట్టలేదు. ఈస్టర్ సండే రోజున జరిగిన దాడి తర్వాత తొలిసారి ఓ విదేశీ అధినేతగా నరేంద్రమోడీ శ్రీలంకలో పర్యటిస్తున్నారు. దీంతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం అవడంతోపాటు .. శ్రీలంకకు వచ్చేందుకు పర్యాటకుల భయం కూడా విడుతారని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.అంతకుముందు ఈస్టర్ సండే రోజు దాడి జరిగిన చోట మృతులకు మోడీ నివాళులర్పించారు.
మృతులకు నివాళి
ఇటీవల రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. అతిథిగా విచ్చేసిన లంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన .. తమ దేశానికి రావాలని మోడీని ఆహ్వానించారు. పదవీ బాధ్యతలు .. క్యాబినెట్ ప్రమాణ స్వీకారం .. శాఖల కేటాయింపు ప్రక్రియ ముగిసిన తర్వాత మోడీ విదేశీ పర్యటన ప్రారంభించారు. తొలుత మాల్దీవులతో మోడీ పర్యటన ప్రారంభమైంది. ఆదివారం శ్రీలంకలో పర్యటన కోసం ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో ద్వైపాక్షిక సంబంధాలపై విసృతంగా చర్చిస్తారు. తర్వాత విపక్ష నేత, మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సేతో కూడా మోడీ సమావేశమవుతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.అంతకుముందు ఈస్టర్ సండే రోజు దాడి జరిగిన చోట మృతులకు మోడీ నివాళులర్పించారు.
మానని గాయం
ఏప్రిల్ 21న .. ఈస్టర్ సండే ... క్రైస్తవులంతా ప్రార్థనలు చేస్తుండగా ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. వరుస బాంబు పేలుళ్లతో లంక దద్దరిళ్లింది. దాదాపు 250 మంది చనిపోయారు. వందల సంఖ్యలో క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈస్టర్ సండే గాయం .. లంకలో ఇంకా మానలేదు. దీంతో శ్రీలంక వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
మళ్లీ తాకిడి ..?
మోడీ పర్యటనతో మళ్లీ లంక పునరుత్తేజం వచ్చే అవకాశం ఉంది. దీంతో విదేశీ నేతలు రాక .. తర్వాత క్రమంగా పర్యాటకుల లంకకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈస్టర్ సండే రోజున జరిగిన దాడిలో భారతీయులు చనిపోయినా .. శ్రీలంక వెళ్లేవారిని తాము ప్రోత్సహించామని శ్రీలంకలో భారత హై కమిషనర్ ఆస్టిన్ ఫెర్నాండో పేర్కొన్నారు. తాజాగా మోడీ పర్యటనతో తీరప్రాంతంలో మరింత భాగస్వామ్యంతో ముందుకుసాగేందుకు దోహదపడతుందని అభిప్రాయపడ్డారు.