మీ వెంట మేమున్నాం: శ్రీలంకకు ప్రపంచదేశాల అండ: భారతీయుల కోసం హెల్ప్ లైన్
న్యూఢిల్లీ: శాంతికాముక దేశంగా గుర్తింపు పొందిన శ్రీలంకలో చోటు చేసుకున్న మారణకాండపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ కు చెందిన ఆత్మాహూతి దళ సభ్యులు సాగించిన విధ్వంసాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. తాము అండగా ఉంటామని, అన్ని విధాలుగా ఆదుకుంటామని శ్రీలంక ప్రభుత్వానికి భరోసా ఇచ్చాయి. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తో పాటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ సానుభూతిని తెలిపారు.
అండగా ఉంటాం: సింహళంలో ట్వీటిన మోడీ
శ్రీలంకలో చోటు చేసుకున్న తాజా పరిణామాల పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోడీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆదిావారం ఉదయం ఆయన సింహళ భాషలో ట్వీట్ చేశారు. ఆధునిక సమాజంలో హింసకు తావు లేదని చెప్పారు. గౌతమ బుద్ధుడి బాటను అనుసరిస్తోన్న శ్రీలంకలో ఇంత పెద్ద ఎత్తున మారణహోమం సాగించడం రాక్షసత్వానికి నిదర్శనమని చెప్పారు. హింస, ప్రతి హింస మానవ సమాజ లక్షణాలు కాదని చెప్పారు. ఈ నరమేథాన్ని సృష్టించిన వారిని అంతర్జాతీయ సమాజంలో దోషిగా చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
దిగ్భ్రాంతిని కలిగిస్తోంది: పాక్
శ్రీలంకలో వరుసగా ఆరు చోట్ల సంభవించిన పేలుళ్లు తమ దేశ ప్రజలను దిగ్భ్రాంతిని కలిగించాయని పాకిస్తాన్ పేర్కొంది. దాడులను తాము ఖండిస్తున్నామని అంటూ ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మొహమ్మద్ ఫైజల్ తెలిపారు. శ్రీలంక ప్రజలకు తాము అండగా ఉంటామని అన్నారు. శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లపై దాడులు చేయడం, పెద్ద సంఖ్యలో ప్రజలను పొట్టన బెట్టుకున్నారని అన్నారు. ఉగ్రవాదుల చర్యలు, వారి కర్యకలాపాలను ఎవరూ సమర్థించబోరని చెప్పారు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో శ్రీలంక ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు తాము అండగా ఉంటామని అన్నారు.
సహాయాన్ని అందిస్తున్నాం: బ్రిటన్
ఈస్టర్ సండే నాడు శ్రీలంకలో చోటు చేసుకున్న దాడులు.. తమ దేశాన్ని కలచి వేశాయని బ్రిటన్ పేర్కొంది. చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి దారుణ ఘటనలు చోటు చేసుకోలేదని శ్రీలంకలో బ్రిటన్ హైకమిషనర్ జేమ్స్ డౌరిస్ అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తాము ఆ దేశ ప్రజలకు అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తామని చెప్పారు. ఇప్పటికే తమ దేశం తరఫున అవసరమైన వైద్య సహయాన్ని అందిస్తున్నామని డౌరిస్ తెలిపారు.
పిరికిపందల చర్య: రణిల్ విక్రమసింఘే
తమ దేశంపై ఉగ్రవాదులు చేసిన దాడిని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న శ్రీలంక ప్రజలు ఈ విపత్కర పరిస్థితి నుంచి త్వరగా కోలుకోగలుగుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో తాము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రజలకు అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తున్నామని అన్నారు. వైద్య చికిత్సను వేగవంతం చేశామని చెప్పారు.
పరిస్థితులను గమనిస్తున్నాం: సుష్మా స్వరాజ్
శ్రీలంకలో నెలకొన్న తాజా పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. భారతీయుల పరిస్థితులపై ఆరా తీస్తున్నామని, దీనికోసం నిరంతరాయంగా కొలంబోలోని భారత రాయబార కార్యలాయాన్ని సంప్రదిస్తున్నామని చెప్పారు. శ్రీలంకలోని భారతీయుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయ, సహకారాలు అవసరమైన వారు +94777903082,+94112422788,+94112422789, +94112422789 నంబర్లకు సంప్రదించాలని సూచించారు.