మోడీ గుజరాతీ సందేశంతో చైనా బౌద్ద గురువుల అయోమయం
బీజింగ్: చైనాలో పర్యటించిన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ దా జింగ్షాన్ బౌద్ధాలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో ఆయన సందర్శకుల పుస్తకంలో గుజరాతీలో తన సందేశాన్ని రాశారు. సందేశ సారాంశం తెలుసుకునేందుకు బౌద్ధ భిక్షువులు పెద్ద కుస్తీయే పట్టారు.
ఆ సందేశం ఏమిటో అర్థం కాక బౌద్ద గురువులు అయోమయానికి గురయ్యారు. తొలుత జియాన్స్ నార్ట్వెస్ట్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లీ లియానన్ను మోడీ సందేశాన్ని చైనాలోకి అనువదించాల్సిందిగా కోరారు. ఆయన దానిని తన శిష్యుడైన భారతీయ విద్యార్థికి అందజేసి చైనా భాషలోకి అనువదింపజేశారు.
ఆయన దానిని హిందీలోకి అనువదించారు. దానిని వారు ఇంగ్లీష్లోకి అనువదించి, అనంతరం చైనా భాషలోకి అనువదించారు. అనంతరం దానిని బౌద్ధ గురువులకు అందజేశారు.
వాస్తవానికి బౌద్ధమత వ్యాప్తికి ఓ బౌద్ధ గురువు చేసిన కృషిని ప్రశంసిస్తూ గత గురువారం మోడీ గుజరాతీ భాషలో ఆ సందేశాన్ని రాశారు. అయితే, ఆ భాష ఏమిటో తమకు అర్థం కాలేదని, అందుకే లీ లియానన్ సహకారం కోరినట్లు చెప్పారు. మోడీ ప్రశంసించిన ఆ బౌద్ధ మత గురువు ధర్మగుప్త.
జన్మతః గుజరాతీ అయిన ధర్మగుప్త 581 - 618ల మధ్య కాలంలో డాక్సింగ్ షాన్ ఆలయంలో నివసించారని, అందుకే, ప్రధాని మోడీ తన సందేశాన్ని గుజరాత్ భాషలో రాశారని ప్రొఫెసర్ లీ లియానన్ చెప్పారు. ధర్మగుప్త సూ సామ్రాజ్య హయాంలో దా జింగ్ షాన్ ఆలయంలో నివసించారు.