ఇజ్రాయెల్లో అంతర్యుద్ధం: అగ్నిగోళంలా ఆ సిటీ: స్టేట్ ఎమర్జెన్సీని విధించిన ప్రధాని
జెరూసలేం: ఇజ్రాయెల్లో అంతర్యుద్ధం రగులుకుంది. ఇజ్రాయెలీలు-పాలస్తీనియన్ల మధ్య అంతర్గత పోరు బట్టబయలైంది. ఈ రెండు దేశాలకు చెందిన పౌరులు పరస్పరం దాడులకు దిగారు. ఈ దాడులు, ప్రతిదాడుల్లో ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసం అయ్యాయి. పలు వాహనాల మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఈ దాడులు.. మరింత విస్తరించే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్టేట్ ఎమర్జెన్సీని విధించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు.
గాజా స్ట్రిప్పై దాడులను నిరసిస్తూ
ఒకవంక- గాజా స్ట్రిప్పై ప్రతీకార దాడులు కొనసాగిస్తూనే.. మరోవంక దేశంలో నెలకొన్న అంతర్యుద్ధ వాతావరణాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటోందక్కడి ప్రభుత్వం. ఇజ్రాయెల్-గాజా స్ట్రిప్ మధ్య కొద్దిరోజులుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. తాజాగా రాకెట్ల దాడులకు దారి తీసింది. గాజా స్ట్రిప్లో అధికారంలో ఉన్న ఇస్లామిక్ హమాస్ ప్రభుత్వం చేపట్టిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. రాకెట్లను సంధించింది. ఈ దాడుల్లో 35 మంది మరణించారు.
ఇజ్రాయెలీలు-పాలస్తీనియన్ల మధ్య
ఈ సమాచారం తెలిసిన వెంటనే- లాడ్ సిటీలో ఉన్న అంతర్యుద్ధం మొదలైంది. ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్లు పరస్పర భౌతికదాడులకు దిగారు. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. ఒకరి ఆస్తులను మరొకరు విధ్వంసానికి దిగారు. ఇంటి బయట పార్క్ చేసి ఉంచిన వాహనాలను తగులబెట్టారు. ఈ దాడుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు పెద్ద ఎత్తున ధ్వంసం అయ్యాయి. గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని నిరసిస్తూ పాలస్తీనియన్లు రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలను చేపట్టారు. నివాసాలు, దుకాణాలపై రాళ్లు విసిరారు.
వాహనాలు ధ్వంసం..
ఇజ్రాయెల్ దక్షిణాది భాగంలో ఉంటుందీ లాడ్ సిటీ. ఇక్కడి ఎష్కాల్ రీజియన్లో అరబ్ దేశాల ప్రజలు, పాలస్తీనియన్లు మెజారిటీ సంఖ్యలో నివసిస్తుంటారు. గాజా స్ట్రిప్పై దాడులు ఇజ్రాయెల్ రాకెట్ దాడులను కొనసాగించిన వెంటనే వారంతా ఆందోళనకు దిగారు. స్థానిక ఇజ్రాయెలీల ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డారు. కార్లు, ఇతర వాహనాలను తగులబెట్టారు. దీనికి ప్రతీగా ఇజ్రాయెల్ పౌరులు కూడా ప్రతిదాడులకు దిగడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఇజ్రాయెల్ జాతీయ పతాకాలను తగులబెట్టారు. ఎటు చూసినా మంటలు కనిపించాయి లాడ్ సిటీలో. ఆ నగరం అగ్నిగోళంలా తయారైంది.
Recommended Video
పలుచోట్ల కర్ఫ్యూ..
పొరుగు ప్రాంతాలకు కూడా ఈ అల్లర్లు పాకుతుండటంతో స్థానిక ప్రభుత్వం అప్రమత్తమైంది. లాడ్ సిటీ మేయర్ రెవిరో సిఫారసుల మేరకు ప్రధాని నెతన్యాహు స్టేట్ ఎమర్జెన్సీని విధించారు. పోలీసులు, జాతీయ భద్రతా బలగాలను ఎష్కాల్ రీజియన్కు తరలించారు. కొన్ని చోట్ల ఆందోళనకారులపై కాల్పులు జరిపినట్లు కూడా సమాచారం అందుతోంది. ఈ రీజియన్ మొత్తాన్నీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) తన ఆధీనంలోకి తీసుకుంది. పలు చోట్ల కర్ఫ్యూ విధించింది. ఆందోళనకారులు, ప్రదర్శనలను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకుంది.