కంపెనీ డైరెక్టర్ను చంపేస్తానని నీరవ్ మోడీ బెదిరించాడు: కోర్టుతో సీబీఐ
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ ప్రముఖ వజ్రాల వ్యాపారి, ఆర్థిక నేరస్తుడైన నీరవ్ మోడీపై క్రిమినల్ అభియోగాలను మోపింది. తన కంపెనీ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న డమ్మీ వ్యక్తిని చంపేస్తానని నీరవ్ మోడీ బెదిరించినట్లు సీబీఐ పేర్కొంది. ప్రస్తుతం కైరోలో ఉన్న డమ్మీ డైరెక్టర్ ఆశిష్ మోహన్భాయ్ భారత్కు వస్తే చంపేస్తానని నీరవ్ మోడీ బెదిరించినట్లు సీబీఐ మహారాష్ట్రలోని ప్రత్యేక కోర్టుకు తెలిపింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో నిందితుడిగా ఉన్న ఆశిష్ మోహన్భాయ్ అరెస్టు నుంచి తప్పించుకునేందుకు దుబాయ్ మీదుగా కైరో పారిపోయాడని వెల్లడించాడు. ఆ తర్వాత 2018 జూన్లో కైరో నుంచి భారత్కు తిరిగి వచ్చేందుకు ప్రయత్నించారని ఆ సమయంలో నీరవ్ మోడీ తరపున నేహాల్ మోడీ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేయగా భారత్కు వస్తే చంపేస్తానని బెదిరించినట్లు సీబీఐ వెల్లడించింది.
ఇక నీరవ్ మోడీకి లండన్ కోర్టులో అనుకూలంగా సాక్ష్యం చెప్పేందుకుగాను లండన్కు వెళ్లేందుకుగాను రూ.20 లక్షలు నేహాల్ మోడీ ముట్టజెప్పినట్లు సీబీఐ వెల్లడించింది. అయితే ఆశిష్ మోహన్ బాయ్ ఈ ఆఫర్ తిరస్కరించినట్లు సీబీఐ చార్జ్షీట్లో పేర్కొంది. ఇదిలా ఉంటే నీరవ్ మోడీని ఈ నెల ప్రారంభంలో ఆర్థికనేరగాడిగా ముంబై స్పెషల్ కోర్టు ప్రకటించింది. ప్రస్తుతం ఆయన లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉన్నాడు.
మెహుల్ చోక్సీతో కలిసి రూ.13,570 కోట్ల భారీ స్కామ్కు పాల్పడ్డాడు నీరవ్ మోడీ. ఆ తర్వాత దేశం విడిచి పారిపోయాడు. అక్కడే ఓ మెట్రో రైల్వే స్టేషన్లో ఉన్న నీరవ్ మోడీని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక అప్పటి నుంచి నీరవ్ మోడీ బెయిల్ కోసం ప్రయత్నించగా కోర్టు బెయిల్ మంజూరు చేసేందుకు తిరస్కరించింది. భారత విచారణ సంస్థలు కూడా నీరవ్ మోడీని భారత్కు తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. నీరవ్ మోడీకంటే ముందు లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా కూడా బ్యాంకులకు కొన్ని వేల కోట్లు ఎగ్గొట్టి లండన్కు పారిపోయాడు. మాల్యాను కూడా భారత్కు రప్పించేందుకు విచారణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.