పీఎన్బీ స్కాం: ఇండియాలో ముంచేసి.. అమెరికాలో దివాలా పిటిషన్ వేసిన నీరవ్ మోడీ!
న్యూయార్క్: పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయలకు నిండా ముంచేసి అమెరికా పారిపోయిన ఫైర్ స్టార్ డైమండ్ కంపెనీ యజమాని నీరవ్ మోడీ తాజాగా అమెరికాలో దివాలా పిటిషన్ దాఖలు చేశారు. న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ మేరకు వేసిన దివాలా పిటిషన్లో తనకున్న అన్ని రకాల ఆస్తుల విలువను 50 నుంచి 100 మిలియన్ డాలర్ల మధ్యన పేర్కొన్నాడు.
బ్యాంకింగ్ రంగంలోని లొసుగులను ఆధారంగా చేసుకుని పీఎన్బీ ముంబై శాఖ నుంచి తప్పుడు ఎల్ఓయూలు సృష్టించడం ద్వారా విదేశాల్లోని దేశీయ బ్యాంకు శాఖల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించకుండా జనవరిలో నీరవ్ మోడీ తన కుటుంబ సభ్యులతోపాటు అమెరికా చెక్కేసిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి మొదటి వారంలో సీబీఐ కేసు నమోదుతో ఈ పీఎన్బీ స్కాం బయటికొచ్చింది. అప్పటికే నీరవ్ మోడీ, ఆయన వ్యాపార భాగస్వామి గీతాంజలి జెమ్స్ లిమిటెడ్ యజమాని మెహుల్ చోక్సీలు దేశాన్ని వీడిపోయారు. తొలుత నీరవ్ మోడీ రూ.11,400 కోట్లకు టోపీ పెట్టాడని ప్రకటించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ తరువాత ఆ మొత్తం రూ.12,700 అంటూ వెల్లడించింది.
పీఎన్బీ స్కాంలో ముంబై బ్రాడీ రోడ్డులోని ఆ బ్యాంకు శాఖలో కొంతమంది ఉద్యోగులు నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు సహకరించడం తెలిసిందే. ఈ స్కాంలో నీరవ్ మోడీకి చెందిన మూడు సంస్థలు డైమండ్ ఆర్ యూఎస్, సోలార్ ఎక్స్పోర్ట్స్, స్టెల్లార్ డైమండ్స్ ప్రమేయం ఉన్నట్లు తేల్చారు. ఈ కంపెనీల పేర్లపైనే ఎల్ఓయూలను నీరవ్ మోడీ తీసుకున్నాడు.
మరోవైపు ఈ స్కాం బయటికొచ్చినప్పట్నించీ పంజాబ్ నేషనల్ బ్యాంకు షేరు పడిపోతూ వస్తోంది. ఫిబ్రవరి 14 నుంచి ఆ షేరు విలువ దాదాపు 40 శాతం పడిపోయింది. పీఎన్బీలో జరిగిన ఈ స్కాం దేశంలోనే అతిపెద్దది అంటూ దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు పేర్కొనడం, మరోవైపు ఆర్బీఐ కూడా ఆ బ్యాంకు లావాదేవీలపై పర్యవేక్షణ ప్రారంభించడంతో స్టాక్ మార్కెట్లో బ్యాంకు షేరు బాగా క్షీణించింది.