ల్యాండవుతూ కుప్పకూలిన విమానం: 12మంది మృతి
సిడ్నీ: కొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా.. సాంకేతికలోపం కారణంగా ఓ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం చెందారు. పాపువా న్యూగినియాలోని ఓ మారుమూల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక్సామిన్ నుంచి కియుంగా ప్రాంతానికి ప్రయాణికులతో బయలుదేరిన సన్బ్రిడ్ ఏవియేషన్ విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది.
దీంతో కియుంగా ఎయిర్పోర్టుకు సమీపంలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పైలెట్ సహా విమానంలోని ప్రయాణికులంతా మృతిచెందారు.
విమానంలో ముగ్గురు చిన్నారులు, ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి సహా 12 మంది ఉన్నారు. ఘటనపై ఆస్ట్రేలియా ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. మృతులకు సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్లు అధికారులు తెలిపారు.
పాక్లో ఘోర రోడ్డు ప్రమాదం : 19 మంది మృతి
పాకిస్థాన్లోని ఫైసలాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.