డ్రగ్స్ ముఠా కేంద్రంపై దాడి: అండర్ గ్రౌండ్ లో పిల్లలు
సిడ్నీ: మత్తు పదార్థాల ముఠా (డ్రగ్స్ ముఠా) స్థవరాలపై ఆస్ట్రేలియా పోలీసులు దాడులు చేశారు. అండర్ గ్రౌండ్ లో నిర్బంధించిన 8 ఏళ్ల బాలుడితో పాటు నలుగురు పిల్లలను పోలీసు అధికారులు క్షేమంగా రక్షించారు.
సిడ్నీ నగరానికి ఉత్తర దిశగా 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలాండ్స్ ప్రాంతంలోని మారుమూల ఇంటిలో డ్రగ్స్ ముఠా కేంద్రం ఉందని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు దాడి చేసి పరిసర ప్రాంతల్లో గాలించిన సమయంలో ఓ అండర్ గ్రౌండ్ గుర్తించారు.
అందులో ఓ బాలుడితో పాటు ముగ్గురు పిల్లలు ఉన్న విషయం వెలుగు చూసింది. కేవలం రెండు చదరపు అడుగుల గదిలో పిల్లల్ని బంధించారని పోలీసులు అన్నారు. ఆ గదిలో చిన్న పరుపు ఓ బకెట్ మాత్రం ఉందని పోలీసులు చెప్పారు.
గత మూడు వారాల నుంచి తమను ఇక్కడ బంధించారని బాలుడు పోలీసులకు చెప్పాడు. సరైన తిండిలేక పిల్లలు నీరసించిపోయారని పోలీసులు అన్నారు. డ్రగ్స్ ముఠా నాయకులు పరారైనారు. అయితే ఇద్దరు పురుషులతో పాటు ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఇంటి పరిసర ప్రాంతాల్లో నిషేదిత గంజాయి మొక్కలు పెంచినందకు, పిల్లలను నిర్బంధించినందుకు కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. డ్రగ్స్ ముఠాకు సంబంధించిన ఇంటి ఫోటోలను పోలీసులు మీడియాకు విడుదల చేశారు.