అమెరికా అల్లర్లలో అనూహ్య మలుపు: పోలీసులు టార్గెట్గా కాల్పులు: మండుతున్న సెయింట్ లూయిస్
వాషింగ్టన్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతానికి నిరసనగా కొద్దిరోజులుగా అమెరికాలో చెలరేగుతోన్న ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు అనూహ్య మలుపును తీసుకున్నాయి. ఈ సారి పోలీసులపై దాడులకు దారి తీసింది. ఏకంగా కాల్పులను జరపడానికి కారణమైంది. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. వారికి ప్రాణాపాయం తప్పిందని అధికారులు తెలిపారు.
సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, టిమ్కుక్ సంచలనం: మూకుమ్మడిగా: నల్లజాతీయులకు అండగా
సెయింట్ లూయిస్లో
సెయింట్ లూయిస్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్లర్లను నియంత్రిండంలో భాగంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు బుల్లెట్లు తగిలినట్లు నిర్ధారించారు. వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. నలుగురికీ ప్రాణాపాయం తప్పినట్లు డాక్టర్లు తెలిపినట్లు సెయింట్ లూయిస్ పోలీసులు ట్విట్టర్ ద్వారా తెలిపారు. పోలీసులపై కాల్పులకు పాల్పడిన వారు ఎంతమంది ఉన్నారనేది తెలియరావట్లేదని అన్నారు. ఈ దిశగా దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పోలీసుల ప్రధాన కార్యాలయం సమీపంలో
సెయింట్ లూయిస్లో గల పోలీసుల ప్రధాన కార్యాలయం వద్దే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాన కార్యాలయం సమీపంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారని, వారిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తోన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ను ట్వీట్ చేసింది. సోమవారం రాత్రంతా ఆందోళనకారులు తమ నిరసన ప్రదర్శనలను నిర్వహించారని, ఆస్తుల విధ్వంసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
పలు రౌండ్ల కాల్పులు
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై పలు రౌండ్ల పాటు కాల్పులు జరిగినట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది. కాల్పుల మోత స్పష్టంగా రికార్డయింది. కాల్పులు ఆరంభం కాగానే పోలీసులు తమ వాహనాల్లో వెనక్కి వెళ్లారు. ఈ సందర్భంగా సంఘటనా స్థలం తుపాకి మోతలు, పోలీసు వాహనాల సైరన్లతో మారుమోగిపోయింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఉన్నతాధికారులు రంగంలో దిగారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. నలుగురికి బుల్లెట్ గాయాలైనట్లు నిర్ధారించారు. వారికి ప్రాణాపాయం తప్పిందని, శస్త్ర చికిత్స చేయాల్సి ఉందని అన్నారు.
నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా..
జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతానికి నిరసనగా ఆఫ్రికన్ అమెరికన్లు తలపెట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు హింసాత్మకంగా రూపుదాల్చాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల విధ్వంసానికి దారి తీశాయ. అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ స్మారకార్థం రాజధాని వాషింగ్టన్ డీసీలో నిర్మించిన మెమోరియల్ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం స్మారక కట్టడాన్ని, అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్హౌస్ సమీపంలోని చర్చిపై దాడులు చేశారు. దీన్ని దేశీయ ఉగ్రవాద చర్యగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. రాజధానిలో సైన్యాన్ని బరిలో దింపారు.