ఫ్రాన్స్ గడగడ: హెలికాప్టర్లతో చేజింగ్, అమరుల్లా చనిపోతామని ఉగ్రవాదులు
ప్యారిస్: ప్యారిస్లో ఉగ్రవాదులు బీభత్సం సృష్టిస్తూనే ఉన్నారు. వరుసగా మూడో రోజు నగరంలో మరోచోట కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఓ కారును వెంబడించిన ఉగ్రవాదులు దానిపై కాల్పులు జరిపారు. ఆ కారును స్వాధీనం చేసుకున్న అందులోని ప్రయాణికులను నిర్బంధించారు. నగరం నుంచి తప్పించుకుని పారిపోవడం కోసం వేరే కారును స్వాధీనం చేసుకున్నట్లు భావిస్తున్నారు. వారిని ఫ్రెంచ్ పోలీసులు వెంటాడారు.
దీంతో, నిందితులు ఓ గోదాములో దాక్కున్నట్లుగా తెలుస్తోంది. ఫ్రాన్స్లో పత్రికా కార్యాలయం పైన దాడి చేసి 12 మందిని హతమార్చిన ఆ ఉగ్రవాదులతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఉగ్రవాదులు గోదాములో దాక్కొని ఉండగా పోలీసులు ఆ భవంతిని చుట్టుముట్టారు.
ఉగ్రవాదుల వద్ద ఓ మహిళ బందీగా ఉన్నట్లు తెలియడంతో పోలీసులు వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. తాము అమరుల్లా చనిపోవాలనుకుంటున్నట్లు వారు పోలీసులకు చెప్పారు. వారి చేతిలో బందీగా ఉన్న మహిళ గోదాములో పని చేసే కార్మికురాలు.
ఆ గోదాము ప్రిటింగ్ ప్రెస్కు చెందింది. అందులో ఉగ్రవాదులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారితో చర్చిస్తూనే... కార్లు, హెలికాఫ్టర్ల ద్వారా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో వెంటనే ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో భాగంగా కాల్పులు జరుపుకుంటూ వెళ్లారు.
ఈ కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ప్రజలను బంధీలుగా చేసుకుంటూ పారిస్ నుంచి బయటపడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తుండగా వారి పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రవాదులను పట్టుకుని తీరుతామని పోలీసులు స్పష్టం చేశారు. పారిస్లో వరుసగా మూడో రోజు కూడా కాల్పులు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
పౌరుల రక్షణ కోసం ఏమైనా చేస్తాం: హోలాండే
దేశంలోని పౌరుల రక్షణ కోసం ఏమైనా చేస్తామని ఫ్రెంచ్ అధ్యక్షులు ఫ్రాంకోయిస్ హోలాండే అన్నారు. ఫ్రాన్స్లో ప్రజలందరూ ఫ్రాన్స్ రిపబ్లిక్లో భాగమన్నారు. ప్రజల రక్షణకు హామీ ఇస్తున్నానని చెప్పారు. సాధారణ పౌరుల రక్షణ కోసం ప్రభుత్వం ఏమైనా చేస్తుందన్నారు.
కాగా, రెండు రోజులుగా క్రితం చార్లిహెబ్డో పత్రికపైన కాల్పులు జరిపిన ఉగ్రవాదుల 12 మందిని హత్య చేశారు. పారిస్ ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాల్పులపై ముందుగా తొమ్మిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ విషయం బయటపడింది.