వార్నీ.. బ్యాంకు దోపిడీ కోసం రూ.8 కోట్లు ఖర్చుపెట్టారు! అంతచేసినా చివరికి...
చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీకి పథకం వేసింది 16 మంది దొంగల ముఠా. తమ స్థావరం నుంచి బ్యాంకు భోషాణం దాకా సొరంగం కూడా తవ్వారు. కానీ డామిట్, కథ అడ్డం తిరిగింది.
సావోపోలో : చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీకి పథకం వేసింది 16 మంది దొంగల ముఠా. తమ స్థావరం నుంచి బ్యాంకు భోషాణం దాకా సొరంగం కూడా తవ్వారు. కానీ డామిట్, కథ అడ్డం తిరిగింది. సొరంగం గుట్టు రట్టవడంతో ఆ దొంగల ముఠా ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తోంది.
బ్రెజిల్లోని సావోపోలోలో జరిగిందీ ఘటన. నేషనల్ బ్యాంకులోని 24 కోట్ల పౌండ్ల (భారతీయ కరెన్సీలో రూ.2400 కోట్లు) సొమ్ము దొంగిలిద్దామనేది పథకం. దొంగలు తమ స్థావరం నుంచి బ్యాంకు భోషాణం దాకా 550 అడుగుల పొడవైన సొరంగం కూడా తవ్వారు. వేసిన పథకం విజయవంతంగా అమలుజరిగి ఉంటే.. ఇది అతిపెద్ద బ్యాంకు దోపిడీగా రికార్డుకెక్కేది.
నాలుగు నెలలు అహోరాత్రాలు కష్టపడి అద్దెకు తీసుకున్న స్థావరం నుంచి నేరుగా బ్యాంకు స్ట్రాంగ్రూం వరకు సొరంగం తవ్వారు. దోపిడీ కోసం సొరంగం తవ్వినా ఆదరాబాదరాగా అన్నట్టుగా కాకుండా వృత్తిపరమైన నైపుణ్యమంతా చూపారా దొంగలు.
సొరంగ మార్గంలో మట్టిపెళ్లలు విరిగిపడకుండా చెక్కలు పేర్చి, స్తంభాలు అదరువుగా పెట్టారు. లోపల అంతా స్పష్టంగా కనిపించేలా లైట్లు అమర్చారు. అక్కడక్కడా విశ్రాంతిగా కూర్చునేందుకు స్టూల్స్ కూడా పెట్టారు.
మొత్తంమ్మీద ఓ మనిషి సునాయాసంగా నడిచివెళ్లేందుకు వీలుగా సొరంగం సిద్ధం చేశారు. మరి అంతభారీ సొరంగమంటే ఊరికే అవుతుందా? ఈ సొరంగం తవ్వడానికి 9,58,808 పౌండ్లు ఖర్చయ్యాయట. అంటే.. మన కరెన్సీలో రూ.8 కోట్లు. ఈ ఖర్చునంతా 16 మంది దొంగలు సమానంగా భరించారు.
ఈ దోపిడీ ప్రయత్నం గురించి పోలీసులకు ముందుగానే ఉప్పందింది. అయినాసరే వారు ఓపికగా రెండునెలలు ఈ దొంగలముఠా కదలికలు గమనిస్తూ కూర్చున్నారు. సొరంగం దాదాపుగా పూర్తయిన తర్వాత రంగంలోకి దిగి వారిని అరెస్టు చేసి ఆట కట్టించారు. సొరంగం తవ్వడంలో వారి పనితనం చూసి పోలీసులే ముక్కున వేలేసుకున్నారు.